ప్రత్యేకహోదా: కాంగ్రెస్ పోరుసభలో కిరోసిన్ పోసి నిప్పంటించుకున్న యువకుడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టన పోరుసభలో కలకలం రేగింది. పోరుసభలో మాజీ కేంద్ర మంత్రి పిల్లి కృపారాణి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. తిరుపతి పట్టణంలో ఇది సంచలనం సృష్టించింది.
తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన జనం అతడిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నిప్పంటించుకున్న యువకుడు తిరుపతిలోని మంచాల వీధికి చెందిన కోటిగా గుర్తించారు.
కోటి చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నాడు. గతంలో గంగన్న గుడి పాలక మండలి సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురు శరీరం 50 శాతం కాలిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేకున్నా మూడు రోజుల తర్వాత అతని శరీరంపై కాలిన ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.
కోటికి వైద్య చికిత్సల మొత్తం తిరుపతికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు భరిస్తామని ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పోరుసభలో కలకలం రేగడంతో కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేశారు. కోటి ఆత్మహత్యాయత్నంపై కాంగ్రెస్ నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ సభలో చిరంజీవి, సి.రామచంద్రయ్య, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పోరుసభ సాయంత్రం 7 గంటలకు వరకు జరగే అవకాశం ఉంది. సభ ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేతలు బాధిత యువకుడిని పరామర్శించే అవకాశం ఉంది.
ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సహా పలువురు నేతలు హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీల అసలు స్వరూపాన్ని బహిర్గతం చేస్తామన్నారు. రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని, ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.