ఘోరం: మద్యం మత్తులో గొర్రెకు బదులు మనిషి తలను నరికేశాడు, ప్లాన్ ప్రకారమేనా?
చిత్తూరు: సంక్రాంతి పండగ పూట దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పొట్టెలును బలి ఇవ్వబోయి.. అక్కడున్న మరో వ్యక్తి తలను నరికాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులు జిల్లాలో కలకలం రేపింది. చిత్తూరు జిల్లా మదనపల్లెని వలసపల్లెలో ఆదివారం రాత్రి జరిగిందీ దారుణం.
దేవుడికి బలిచ్చే సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలు తల అనుకుని మనిషి తలను నరికాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కనుమ పండుగ నేపథ్యంలో ఊరి పొలిమేర ఉన్న గ్రామ దేవతకు జంతు బలి ఇచ్చే సమయంలో పొట్టేలును పట్టుకుని ఉన్న తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్ (35) ను... పొట్టేలు నరికే వ్యక్తి చలపతి నరికేశాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు రక్తపు మడుగులో కుప్పకూలిన బాధితుడు సురేష్ను హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, సురేష్, చలపతి ఇద్దరు వరుసకు అన్నదమ్ములని తెలుస్తోంది. జాతరకు చందా ఇవ్వకుండగా హంగామా చేస్తున్న సురేష్ను అందరి ముందే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్నదమ్ముల మద్య పాత కక్షలే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చని మదనపల్లి రూరల్ పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. అనంతరం మృతుడిని మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తులు అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.
మరో విషాదం: కాలువలో పడి ఇద్దరు మృతి
సంక్రాంతి పండగపూట విషాద ఘటన చోట చేసుకుంది. కాల్వలోకి స్నానానికి దిగిన ఆరుగురు యువకుల్లో ఇద్దరు నీటమునిగి మరణించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో చోటుచేసుకుంది. రాజవరం గ్రామ శివారులో ఉన్న ఎర్ర కాలువలో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సంక్రాంతి పండుగ కావడంతో జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు రాజవరంలో ఉన్న ఎర్ర కాల్వ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అంతా కలిసి కాల్వలోకి స్నానానికి దిగారు.
వీరిలో జెట్టి ముఖేష్( 21) జెట్టి గణేష్ (20) లోతులోకి వెళ్లారు. ఈత రాకపోవడం, కాల్వ లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు. మిగతా నలుగురు స్నేహితులు గట్టుపైకి చేరారు. వెంటనే ఆ నలుగురు యువకులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థులంతా అక్కడికి చేరుకొని ఇద్దరు యువకులు మృతదేహాలను బయటకు తీశారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యలగూడెం పోలీసులు తెలిపారు. పండగపూట ఇద్దరు యువకుల మరణంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.