ఓ మంచి ఆఫర్- నిరాకరించిన సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని లోక్ భవన్ లో అందజేశారు. ఆ సమయంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అందుబాటులో లేరు. కుటుంబ అత్యవసర పనుల నిమిత్తం తన స్వస్థలానికి వెళ్లారు. దీంతో సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని లోక్ భవన్ లో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ కు అందజేశారు. రాజీనామా పత్రం తనకు అందినట్లు ఆయన వెల్లడించారు. గవర్నర్ దీన్ని ఆమోదిస్తారని తెలిపారు.
అనంతరం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర, ఇతరులతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. రాజీనామా చేయడానికి గల కారణాల గురించి వెల్లడించారు. భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ హైకమాండ్ తనను రాజీనామా చేయమని అడిగిందని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే రాజీనామా చేస్తానని ముందునుంచీ పలుమార్లు చెబుతూనే వచ్చానని గుర్తు చేశారు.

కాగా ముఖ్యమంత్రి పదవిని త్యజించినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు కొన్ని ఆఫర్లు పెట్టింది. అందులో ఒకటి- రాజ్యసభ సీటు. త్వరలో ఖాళీ అయ్యే స్థానాల కోసం కర్ణాటక నుంచి నామినేట్ చేస్తామని తెలిపింది. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన రాజ్యసభ ఆఫర్ విషయాన్ని సిద్ధరామయ్య నిర్ధారించారు. దాన్ని తిరస్కరించానని తెలిపారు. రాజ్యసభకు వెళ్లాలనుకోవట్లేదని తేల్చి చెప్పారు.
జాతీయ రాజకీయాలపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని, ఢిల్లీలో కూర్చుని సాధించేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. ఇన్ని సంవత్సరాల పాటు తనను ఆదరించిన కర్ణాటక, ఇక్కడి ప్రజలను కాదని జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేనని స్పష్టం చేశారు.
రాజకీయం కక్ష సాధింపు చర్యలపైనా సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు తన కుటుంబం కూడా బలైందని పేర్కొన్నారు. "రాజకీయాలకు దూరంగా ఉంటూ, కుటుంబాన్ని చూసుకోవడానికీ, పిల్లలను పెంచడానికీ మాత్రమే పరిమితమైన నా భార్యపై కూడా నా రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ఆరోపణలు చేసి, ఆమెను మానసికంగా వేధించారు. ఇదంతా అనుభవించిన తరువాత, నా మనస్సు ఎంతో కలత చెంది, రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆలోచించాను.." అని అన్నారు.
శత్రువుల దాడులకు భయపడి పారిపోవద్దని, ప్రజాసేవా మార్గం నుండి వెనక్కి తగ్గొద్దని తన అంతరాత్మ హెచ్చరించిందని, అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాటం కొనసాగించి, ఆ ఆరోపణల మరకను తొలగించుకోవడం ద్వారా ఉపశమనం పొందానని అన్నారు.












Click it and Unblock the Notifications