మీడియా ముందుకు సిద్ధరామయ్య- కీలక ప్రకటన
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని లోక్ భవన్ లో అందజేశారు. ఆ సమయంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అందుబాటులో లేరు. కుటుంబ అత్యవసర పనుల నిమిత్తం తన స్వస్థలానికి వెళ్లారు. దీంతో సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని లోక్ భవన్ లో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ కు అందజేశారు. రాజీనామా పత్రం తనకు అందినట్లు ఆయన వెల్లడించారు. గవర్నర్ దీన్ని ఆమోదిస్తారని తెలిపారు.
అనంతరం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర, ఇతరులతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. రాజీనామా చేయడానికి గల కారణాల గురించి వెల్లడించారు. ఆ సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ హైకమాండ్ తనను రాజీనామా చేయమని అడిగిందని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే రాజీనామా చేస్తానని ముందునుంచీ పలుమార్లు చెబుతూనే వచ్చానని గుర్తు చేశారు.

రెండు రోజుల క్రితం హైకమాండ్ ఢిల్లీకి పిలిపించి, పదవిని వీడమని ఆదేశించిందని సిద్ధరామయ్య తెలిపారు. లోక్ భవన్లో రాజీనామా పత్రాన్ని అందజేశానని, గవర్నర్ ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేరని, ఆయన ఈ రాత్రే తిరిగి వస్తారని సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ, డీకే శివకుమార్ తో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. కర్ణాటక కాంగ్రెస్ ఒకే కుటుంబంగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
ఓ చిన్న పల్లెటూరి నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టిన తాను ఓ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేస్తానని ఊహించలేదని సిద్ధరామయ్య అన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం తనకు గానీ, తన కుటుంబానికి గానీ లేదని గుర్తు చేశారు. తన కుటుంబంలో ఎవ్వరూ రాజకీయాల్లో లేరని పేర్కొన్నారు. బుద్ధుడు, బసవేశ్వరుడు, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల సిద్ధంతాలను రాజకీయాల్లో కూడా ఆచరించి చూపాలన్నదే తన ఆశయమని, వాటినే నమ్ముకుని పాలన సాగిస్తూ వచ్చానని పేర్కొన్నారు.
గత 20 సంవత్సరాలుగా తాను కేబినెట్ సహచరులపై కోపగించుకున్నానని, కొన్నిసార్లు అరిచానని సిద్ధరామయ్య నవ్వుతూ చెప్పారు. తాను ఏం చేసినా, అది పార్టీ ప్రయోజనాల కోసమే తప్ప, వ్యక్తిగతం కాదని వ్యాఖ్యానించారు. దాన్ని మనసులో పెట్టుకోవద్దని, మర్చిపోవాలని కోరారు. కించపర్చాలనే ఎటువంటి వ్యక్తిగత ఉద్దేశ్యం తనకు లేదని, ఇన్ని సంవత్సరాలలో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారని ధన్యవాదాలు తెలిపారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కృషి చేశానని సిద్ధరామయ్య పేర్కొన్నారు. 2013లో 163 హామీలు ఇవ్వగా, వాటిలో 158 హామీలను నెరవేర్చామని గుర్తుచేశారు. 2023లో 550కి పైగా హామీలు ఇవ్వగా వాటిలో 300పైగా అమలు అయ్యాయని, ఇంకా మిగిలిన రెండేళ్ల సమయంలో అవి కూడా పూర్తవుతాయని అన్నారు. దీనికి అదనంగా అయిదు గ్యారెంటీలను మొదటి సంవత్సరంలోనే అమలు చేశామని ధీమాగా చెప్పారు.
అతిపెద్ద ఓబీసీ నాయకులలో ప్రజాకర్షణ ఉన్న సిద్ధరామయ్య పదవీ నిష్క్రమణతో కర్ణాటక రాజకీయ ప్రస్థానంలో ఓ అధ్యాయానికి తెర పడినట్టయింది. ఈ సంవత్సరం జనవరిలో తన రాజకీయ గురువు దేవరాజ్ అర్స్ను అధిగమించి కర్ణాటకకు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. పాత తరం రాజకీయ నాయకుడిగా, సాటిలేని వ్యూహాలతో, ప్రజాకర్షణలో తనదైన పంథాను ఏర్పరచుకున్నారు.












Click it and Unblock the Notifications