వైసీపీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు - మంచు మనోజ్
మంచు మనోజ్ తాజాగా చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తండ్రి మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మంచు మనోజ్ రాజకీయాల గురించి మాట్లాడారు. మనోజ్ పలానా వ్యక్తికి ఓటు వెయ్యండి, వేయొద్దు అని చెప్పకుండా, రాజకీయాలపై తనదైనశైలిలో స్పందించారు. ఎన్నికలలో పది మందిని కలుపుకుని ముందుకు వెళ్లే నాయకుడిని వెతుకండి, అలాగే అవగాహనతో సరైన లీడర్ను ఎన్నుకోండి అని మనోజ్ చెప్పారు.
కొందరు నాయకులు వాళ్ల కుటుంబానికి , చుట్టుపక్కల వాళ్ళకి సాయం చేయడం లేదు. అలాంటి నాయకులు ఇంకా ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఓటు వేసేటప్పుడు ఈ అంశాలను గుర్తు పెట్టుకుని ఏ నాయకుడుకి ఓటేస్తే, పేదలకు న్యాయం జరుగుతుందో వారికి ఓటు వేయండి అని తెలిపారాయన.డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీకు నచ్చిన వాళ్లకు మాత్రమే వెయ్యాలని కోరారు.

అందరిని కలుపుకుని వెళ్లే వాడే అసలైన నాయకుడని, ఎటువంటి మనిషకైనా ఈర్ష్య, ద్వేషాలు, స్వార్థం అనేవి వస్తే అవి అతని పతనానికి దారితీస్తాయని, అంతా నాది అనుకునేవాడికి, 'పీస్ ఆఫ్ మైండ్' ఇక ఉండదు అని చెప్పారు. మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఉద్దేశించే మనోజ్ చేశారని టీడీపీ, జనసేన కార్యకర్తలు అభిప్రాయడుతున్నారు. జగన్ తన ఇంట్లోనే న్యాయం చేయలేకపోయారని.. ఇప్పుడు ఇదే విషయాన్ని మనోజ్ సైతం చెప్పారని జగన్ వ్యతిరేకవర్గం ఆరోపిస్తోంది.

అటు వైసీపీ సోషల్ మీడియా సైతం మంచు హీరోపై విమర్శలకు దిగింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన మంచు మనోజ్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాను ఏ పార్టీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని..తన మాటలను ఏ రాజకీయ పార్టీకి ఆపాదించవద్దని అభిమానులను మంచు మనోజ్ కోరారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాల్లేవని.. అన్ని పార్టీల్లో తన శ్రేయోభిలాషులు ఉన్నారని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. ఇక మంచు మనోజ్ భార్య భూమా మౌనిక అక్క భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుండి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ చేసిన ఈ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications