రాజకీయపార్టీల రాజధానిగా మంగళగిరి...ప్రధాన పార్టీల మెయిన్ ఆఫీసులన్నీ అక్కడే...
అమరావతి: అవును...మంగళగిరి టైమొచ్చింది....ఒకప్పడు మంగళగిరికి మహర్థశ పట్టబోతుందంటూ ఎక్కడెక్కడి వాళ్లు ఇక్కడి స్థలాలు కొనేందుకు బస్తాల్లో డబ్బులేసుకొని ఇక్కడ దిగారు..స్థలాలు కొన్నారు...భూముల ధరలు చుక్కలనంటేలా పెంచేశారు. కట్ చేస్తే...చాలా కాలం వారనుకున్నట్లు ఏమీ జరగలేదు...అప్పులు తెచ్చి భూములు కొంటే వడ్డీలు కొండల్లా పెరిగి లబోదిబోమన్నారు.
కొందరు అయినకాడికి తెగనమ్ముకున్నారు...మరికొందరు కొంతకాలం ఓపిక పట్టి పరిస్థితి మరీ క్షీణించి వచ్చిందే మేలనుకొని స్థలాలు అమ్మేశారు...అయితే వారందరూ అప్పుడు కలలు కన్న ఆ మహర్థశ మంగళగిరికి ఇప్పుడొచ్చేసింది...అందుకే ఈ ప్రాంతంలోనే తమ పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ బారులు తీరుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు టిడిపి, వైసిపి,బిజెపిల దారిలోనే ఇప్పడు జనసేన కూడా ఇక్కడే పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది.

భౌగోళికంగా మంగళగిరి...
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉండే మంగళగిరి మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. కారణం మంగళగిరి రాజకీయ పార్టీల రాజధాని కానుండటమే. చెన్నై, కలకత్తా జాతీయ రహదారి పక్కనే ఉన్న మంగళగిరి ప్రాంతంలోనే తమ పార్టీ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకొనేందుకు ప్రధాన పొలిటికల్ పార్టీలన్నీ సంసిద్దమవుతున్నాయి. అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఇప్పటికే తమ పార్టీ కార్యాలయాల ఏర్పాటును ఖరారు చేశారు. జాతీయ పార్టీ బిజేపీ కూడా తమ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం స్థలాన్వేషణలో ఉంది. తాజాగా జనసేన పార్టీ కూడా తన ప్రధాన కార్యాలయాన్ని మంగళగిరి ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి రైతుల నుంచి భూమిని కూడా తీసుకోవడంతో ఒక్కసారిగా మంగళగిరి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

చుక్కల్లో భూముల ఖరీదు...
చెన్నై, కలకత్తా జాతీయ రహదారి పక్కనే ఉండే మంగళగిరికి మహర్థశ అంటూ ప్రచారం జరగడంతో గతంలోనే ఇక్కడ భూముల ధరలు కొండెక్కగా , అమరావతి రాజధాని ప్రకటన తరువాత ఇక్కడి భూముల ధరలు చుక్కల నంటాయి. మంగళగిరి భౌగోళికంగా ఇటు అమరావతి, గుంటూరు, అటు విజయవాడకు దగ్గరగా ఉండటమే ఈ ప్రాంతానికి ఇంత డిమాండ్ తెచ్చింది. దీంతో పాటు అన్ని వసతులు అందుబాటులో ఉండటంతో పలు పెద్ద కంపెనీలతో పాటు ఎన్నో అంతర్జాతీయస్థాయి రియల్ వెంచర్లూ ఇక్కడ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అలాగే కొన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలూ ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు.

రాజకీయ పార్టీల చూపు పడింది...
దీంతో ప్రస్తుతం రాజకీయ పార్టీల చూపు కూడా ఈ ప్రాంతంపైనే పడింది. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చెయ్యడం ఏ రకంగా చూసినా మంచిదనే నిర్ణయానికి ఆయా పార్టీలు నిర్ణయించుకున్నాయి. పైగా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన పార్టీలన్నీ పార్టీ ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేపడుతున్నాయి.

టిడిపి ప్రధాన కార్యాలయం ఇక్కడ..
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తన ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా గుంటూరులో కొనసాగిస్తోంది. అయితే శాశ్వత కార్యాలయ భవనాన్ని మాత్రం మంగళగిరి ప్రాంతంలోనే నిర్మించేందుకు ముహూర్తం కూడా సిద్దమైంది. మంగళగిరి ఆత్మకూరు ప్రాంతంలో ఎపి పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా టిడిపి ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ఈ నెల 26వ తేది తెల్లవారుజామున 5 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు.

నిర్మాణంలో ప్రతిపక్షం వైసిపి కార్యాలయం...
మణిపాల్ ఆస్పత్రికి సమీపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఇప్పటికే నిర్మాణ దశలో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన హైదరాబాద్లో వైసిపి అధినేత జగన్చే ప్రత్యేక పూజలు చేయించిన ఇటుకలను ఇక్కడకు తీసుకు వచ్చి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. స్థానిక వైసిపి నేతకు చెందిన రెండెకరాలు స్థలంలో వైకాపా ప్రధాన కార్యాలయంతో పాటు జగన్ నివాస గృహాన్నీ కూడా ఇక్కడే నిర్మిస్తున్నారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులూ కార్యాలయం చుట్టు పక్కలే తమ నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎక్కడా?
కేంద్రంలో అధికార పార్టీ అయిన బిజేపి తమ రాష్ట్ర కార్యాలయం మంగళగిరి సమీపంలోనే ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించింది. తొలుత ఆ పార్టీ ఎంపి గోకరాజు గంగరాజు సీతానగరంలో బిజేపి ఆఫీసు కోసం స్థలం సూచించినా ఆ పార్టీ అగ్రనేతలు మాత్రం మిగతా రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలకు చేరువలోనే తమ పార్టీ ఆఫీసు కూడా ఉంటే బావుంటుందని భావిస్తున్నారట.దీంతో బిజెపి రాష్ట్ర కార్యాలయానికి అనుకూలమైన స్థలం కోసం అన్వేషణ జరుగుతున్నట్లు సమాచారం.

రంగంలోకి దిగిన జనసేన..
లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్లు జనసేన పార్టీ కూడా తమ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీసు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు కార్యసాధనలో చురుగ్గా దూసుకుపోతున్నారు. మంగళగిరి సమీపంలో ఉండే చినకాకాని వద్ద జనసేన కార్యాలయ నిర్మాణం కోసం 3.42 ఎకరాలను ఒక రైతు నుండి మూడేళ్లకు లీజుకు తీసుకున్నారు. త్వరలోనే జనసేన కార్యాలయ శంకుస్థాపన ఉంటుందని, తమ అధినేత పవన్ చేతుల మీదుగానే ఆ కార్యక్రమం జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

రాజకీయ రాజధానిగా మంగళగిరి..
అన్ని ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాలు ఇక్కడ కొలువుదీర నుండటంతో ఇక మంగళగిరి రాజకీయ రాజధానిగా మారడం అనివార్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయా పార్టీల ముఖ్యనేతల నుంచి దిగువస్థాయి నేతల వరకూ ఇక్కడకు రాకపోకలు సాగించే నేపథ్యంలో మంగళగిరి పొలిటికల్ హబ్ గా మారేందుకు ఎంతో సమయం పట్టదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications