పవన్ భద్రతకు ముప్పు - ఎక్కడికెళ్లినా వెంటాడుతున్నారు : మనోహర్ సంచలనం..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా, కొందరు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పవన్ ను వెంటాడుతున్నారంటూ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సంచలన అంశాలను వెల్లడించారు. పవన భద్రతకు ముప్పు పొంచి ఉందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేసారు. విశాఖ ఘటన తరువాత పవన్ కార్యాలయం, ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తచ్చాడుతున్నారని పేర్కొన్నారు. బుధవారం కారులో, అంతుకు ముందు ద్విచక్ర వాహనాలతో వెంటాడారని వివరించారు.
విరిని గమనిస్తున్న పవన్ భద్రతా సిబ్బంది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇంటి ముందు గొడవకు దిగిన ఇద్దరినీ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసుల కధనం ప్రకారం గత నెల 31వతేదీ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నివిసించే ముగ్గురు వ్యక్తులు ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. తిరిగి వస్తూ మధ్యలో పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కారు నిలిపారు. అక్కడ ముగ్గురు బౌన్సర్లు విధుల్లో ఉన్నారు. ఇంటి ముందు అడ్డుగా నిలపటంతో వెంటనే తీసేయాలని సూచించారు.
ఆ క్రమంలో రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఆ యువకులు బౌన్సర్లను తిట్టి నెట్టివేసారు.ఈ ఘటన పైన పోలీసు స్టేషన్ లో బౌన్సర్లు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. పవన్ కళ్యాణ్ పై దాడికి అవకాశం ఉందని గతంలోనే నిఘా అధికారులు హెచ్చరించారని జనసేన నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ పవన్ భద్రతకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఏపీ రాజకీయాల కేంద్రంగా అనేక ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో మరింత గా జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.