మానససరోవర యాత్ర: ఇబ్బందుల్లో తెలుగు యాత్రికులు, బేస్ క్యాంపులో 3వేలమంది
Recommended Video
న్యూఢిల్లీ: కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి యాత్రికులు ఈ యాత్రకు వెళ్లారు. నేపాల్ -భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు నిలిచిపోవడంతో గత రెండు రోజులుగా యాత్రికులు అవస్థలు పడుతున్నారు.
ఆహారం దొరక్క సాయం కోసం వేచి చూస్తున్నారు. తీవ్రమైన చలితో ఇద్దరు చనిపోయారనే వార్తలు రావడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.
తీవ్రమైన మంచు కారణంగా..
తీవ్రమైన మంచు వర్షం ప్రభావంతో వాతావరణం అనుకూలించకపోవడంతో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వేలాది మంది యాత్రికులు నేపాల్-చైనా సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రాంతంలో గత మూడు రోజులుగా హెలీకాప్టర్లు తిరగడం లేదు. రవాణాకు అంతరాయం కలగడంతో వీరంతా చైనా సరిహద్దు సమీపంలో నేపాల్కు చెందిన హిస్సా సరిహద్దు శిబిరంలో ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడి బేస్క్యాంపులో సరైన ఆహారం, వసతులు లేక వారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
వసతుల్లేవు..
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో మహిళలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. బేస్ క్యాంపులో కేవలం వెయ్యి మందికి మాత్రమే వసతులు ఉన్నాయి. మూడు వేల మంది వరకూ ఆశ్రయం పొందడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. బేస్క్యాంపు చేరి ఆశ్రయం పొందిన వారికి ఆహారం కూడా అందడం లేదు. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు గడిస్తే ఆకలితో అలమటించే దుర్భర పరిస్థితి నెలకొంటోంది.
ఏపీ సీఎం చంద్రబాబు ఆరా
ఈ సమాచారం అందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశంతో ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు రంగంలోకి దిగారు. సహాయ చర్యలపై నేపాల్లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. నేపాల్లోని హిల్సాలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను హెలికాప్టర్లో సిమిల్కోట్కు తరలించేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్తో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు.
హిల్సాలోని తెలుగు యాత్రికుల యోగ క్షేమాలపై ఆరా తీశారు. పరిమిత సదుపాయాలు ఉన్న బేస్ క్యాంప్లో దాదాపు 3 వేల మంది భారతీయులు చిక్కుకున్నారని, వారిలో 100 మంది వరకు తెలుగు యాత్రికులున్నారని శ్రీకాంత్ వివరించారు. వెంటనే ఎయిర్లైన్స్ ప్రతినిధులతో మాట్లాడాలని, తెలుగు యాత్రికులను హెలికాప్టర్లో సిమిల్కోట్కు, అక్కడి నుంచి విమానంలో నేపాల్గంజ్కు తరలించే అంశాన్ని పరిశీలించాలన్నారు.
నేపాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించాలని సూచించారు. యాత్రికులకు పూర్తి సహకారం అందించాలని, రవాణా, వైద్య సదుపాయాలు సమకూర్చాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో తెలుగు యాత్రికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చాలని నేపాల్లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందికి ఏపీ భవన్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఏపీ నుంచే ఎక్కువ మంది
జగ్గయ్యపేట, చింతలపూడి, తిరువూరు, విజయవాడ పట్టణంలోని చిట్టినగర్, ఒకటో పట్టణం, కృష్ణలంక, పటమట, పోరంకి, కంకిపాడు తదితర ప్రాంతాల నుంచి పలువురు యాత్రికులు జూన్ 23న బయలుదేరారు. స్థానికంగా కుమార్ ట్రావెల్స్ ద్వారా వీరు నేపాల్కు చెందిన సత్యం టూర్స్తో ఒప్పందం చేసుకున్నారు. జూలై 3న తిరిగి లక్నోకు చేరుకోవాల్సి ఉంది.
జులై 3న విమాన ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.60లక్షలు చొప్పున వసూలు చేశారు. ముందుగానే యాత్రీకులవద్ద అంగీకార పత్రం రాయించుకున్నారు. అవాంతరాలు ఏర్పడి యాత్ర నిలిచిపోతే తమకు సంబంధం లేదని, ఎవరి ఖర్చులు వారే భరించాలని ఆ ఒప్పందంలో ఉంది. అయితే, యాత్రకు వెళుతున్న సమయంలోనే హిల్సా వద్ద ఆగిపోయారు.
కాగా, మానస సరోవర్ యాత్రలో చిక్కుకుపోయిన భారతీయ యాత్రికులను క్షేమంగా రప్పించడానికి నేపాల్లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రయత్నాలు మొదలుపెట్టింది. చిక్కుకుపోయిన సుమారు మూడు వేల మంది భారతీయుల్లో వంద మంది దాకా తెలుగువారు ఉన్నారని, వారందరినీ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ సోమవారం నేపాల్ భారతీయ రాయబార కార్యాలయ సిబ్బందిని కోరారు.
పలువురు శ్వాసకోస, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వారిని సాధ్యమైనంత త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్రికులను హిల్సా బేస్ క్యాంప్ నుంచి హెలీక్యాప్టర్లు, ఛార్టెడ్ విమానాలు ఉపయోగించి సిమిల్కోట్, నేపాల్గంజ్ తరలిస్తామని వారు హామీ ఇచ్చారు. భారతీయ యాత్రికులకు అవసరమైన ఏర్పాట్లను చూసుకుంటున్నామని తెలిపారు.