తెలుగు విద్యార్థులపై రాడ్లు, కర్రలతో ఉత్తరాదివారి దాడి (పిక్చర్స్)
విశాఖ: అడిగిన వెంటనే మంచినీళ్ళు తీసుకురాలేదన్న చిన్నకారణం ముప్పై మందికి పైగా విద్యార్ధులు గాయాలపాలయ్యేందుకు కారణమైంది. దక్షిణాది విద్యార్ధులపై ఉత్తరాది విద్యార్ధులు దాడికి దిగిన సంఘటన తీవ్రస్థాయికి చేరుకుంది. పోలీసులు కేసులు నమోదు చేశారు. పలుచోట్ల నుంచి బాధిత విద్యార్దుల తల్లిదండ్రులు తరలివచ్చారు.
విశాఖ నగర శివారు మిథిలాపురి వుడాకాలనీ సమీపానున్న నారాయణ ఐఐటీ అకాడమీ సీబీఎస్ఈ బాయ్స్ రెసిడెంటియల్ క్యాంపస్లో ఉత్తరాదికి చెందిన సీబీఎస్ఈ విద్యార్ధులు, స్టేట్ సిలబస్ ఐఐటీ విద్యార్ధులు చదువుతున్నారు.
ఉత్తరాధి రాష్ట్రాలు చత్తీస్గడ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన సిబిఎస్ఇ విద్యార్ధుల్లో ఒకరు శుక్రవారం సాయంత్రం స్టేట్ సిలబస్ ఐఐటీకి చెందిన ఓ విద్యార్ధిని మంచినీళ్ళు తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీనికి ససెమిరా అన్న ఆ విద్యార్థిపై కొందరు దాడికి దిగారు.
విషయం తెలుసుకున్న ఉత్తరాధి విద్యార్ధులంతా ఏకమై దక్షిణాది ప్రాంతాలకు చెందిన విద్యార్ధులతో వాదనకు దిగారు. ఇది కాస్త తీవ్రమైంది. దీంతో క్యాంపస్ వార్డెన్లు, భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఇరువర్గాల విద్యార్ధులను శాంతింపు చేసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.
కళాశాలలో గొడవ
చివరకు పీఎం పాలెం పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోలీసులు క్యాంపస్కు చేరుకుని అసలు విషయం తెలుసుకుని, విద్యార్ధుల మధ్య సయోధ్య కుదిర్చి ఆ తరువాత కౌన్సెలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్న పోలీసులు విద్యార్ధుల గదులకు తాళం వేయించి మరీ అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
కళాశాలలో గొడవ
అయితే అసలు గొడవ ఇక్కడ నుంచే మొదలైంది. నీళ్ళు తీసుకురాలేదన్న కోపంతో ఉత్తరాధి ప్రాంతాల విద్యార్ధులు కొందరు తాము ఉంటున్న గదుల కిటికీలను సైతం తొలగించి కిందకి దూకి పక్క క్యాంపస్ గదుల్లోకి చొరబడ్డారు. ఇనుపరాడ్లు, ట్యూబ్లు, కర్రలతో వెళ్ళిన వీరంతా నిద్రపోతోన్న దక్షిణాదికి చెందిన తెలుగు విద్యార్ధులను చిదగ్గొట్టారు.
కళాశాలలో గొడవ
తెల్లవారుజామున మూకుమ్మడిగా దాడికి దిగిన సంఘటనతో భయాందోళనకు గురైన తెలుగు విద్యార్ధులు గాయాలపాలయ్యారు. అక్కడ నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకోవడాన్ని గమనించిన క్యాంపస్ సిబ్బంది పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశారు. పోలీసులకు పిర్యాదు అందింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
కళాశాలలో గొడవ
అప్పటికే తీవ్రగాయాలపాలైన విద్యార్ధులు తమ గోడు చెప్పుకున్నారు. శనివారం ఉదయం డీసీపీ రవి కుమార్, సీఐ అప్పలరాజు, ఇతర పోలీసు సిబ్బంది తరలివచ్చారు. బాధిత విద్యార్ధుల నుంచి సంఘటన వివారలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంపస్ సిబ్బంది, దాడికి దిగిన విద్యార్ధుల నుంచి వేర్వేరుగా వివరాలు సేకరించారు. కాగా, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.