ఎందుకింత స్వామి భక్తి: గ్రూపు-2లో టీడీపీ పధకాలపై ప్రశ్నలు: ఏపీపీఎస్సీలో ఎప్పుడూ లేని విధంగా..!
ఏపీలో ఎన్నికలు దాదాపు పూర్తయినా..రీ పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రభుత్వ నిర్ణయాల గురించి పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వటం సహజమే. అయితే, మరీ స్వామి భక్తి చాటుకొనేలా ప్రభుత్వ పధకాల గురించే ఇన్ని ప్రశ్నలు వేయటం విమర్శలకు కారణమైంది. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూపు-2 పరీక్షలో ఏపీ ప్రభుత్వం.. సీఎం పధకాల పైనే అనేక ప్రశ్నలు వేయటం పైన ఇప్పుడు విద్యావేత్తలు విస్తుపోతున్నారు.

ప్రభుత్వ పధకాలే ప్రశ్నలుగా..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమనరీ పరీక్షలో పలు ప్రశ్నలు అభ్యర్థులనే కాదు..విద్యా వేత్తలనును విస్తుపోయేలా చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రిని కీర్తించటం కోసమే అనే విధంగా ప్రశ్నలు కనిపించాయి. పరీక్షల్లో ప్రభుత్వ కీలక నిర్ణయాలు..ప్రజలపైన ప్రభావం గురించి ప్రశ్నలు ఇవ్వటం సాధారణమే. అయితే, మోతాదు మించి స్వామి భక్తిని చాటుకొనే విధంగా ఇంతలా టీడీపీ ప్రభుత్వ పధకాలను ప్రశ్నలుగా ఇవ్వటమే ఇప్పుడు విమర్శలకు అసలైన కారణంగా విద్యా వేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఏపీలోని మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్కు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ తరుణంలో జరిగిన గ్రూప్-2 పరీక్షలో ఏపీపీఎస్సీ అడిగిన పలు ప్రశ్నలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో అసలు ఇలాంటి ప్రశ్నలు ఇవ్వచ్చా..లేక పరీక్షలకు కోడ్ వర్తించదని ఏపీపీఎస్సీ అధికారులు భావిస్తున్నారా అనే చర్చా సాగుతోంది.

ప్రశ్నలు చూస్తే విస్తుపోవాల్సిందే..
ఏపీపీఎస్సీ ఈసారి ప్రశ్నలను రూపొందింపజేయడంలో ముఖ్యమంత్రి పట్ల స్వామిభక్తిని చాటుకోవానికేనా అనే అనుమానం కలుగుతోంది. చంద్రబాబు పేరిట అమలవుతున్న పథకాలతో పాటు పేదరికంపై గెలుపు, ఆదరణ, ఎన్టీఆర్ విదేశీ విద్య తదితర స్కీములపైనా ప్రశ్నలను ప్రశ్నాపత్రంలో పొందు పరిచారు. అందులో కొన్ని ప్రశ్నలను పరిశీలిస్తే..
* చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందిన వారైతే ఆ జంటకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి ఎంత?
* పసుపు కుంకుమ పథకం ఏ వర్గానికి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది?
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఎన్టీఆర్ విదేశీ విద్య, ఆదరణ పథకం ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది?
* చేతివృత్తుల వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రముఖ పథకం పేరు?
* ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పాడు?
* ఎన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర పథకాల అమలులో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది?
ఇలాంటి మరెన్నో ప్రశ్నలు గ్రూపు-2 ప్రశ్నాపత్రంలో కనిపించాయి. వీటిని చూసిన అభ్యర్దులు సైతం ప్రభుత్వ పధకాల గురించి ఇంతగా భజన అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

ఏపీపీఎస్సీ స్పందిస్తుందా..
గ్రూపు-2 ప్రశ్నాపత్రంలో పాలకులను మెప్పించేందుకు ఇంతగా ప్రయత్నించాలా అనే చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ పదకాలకు ఏపీపీఎస్సీ పరీక్ష ద్వారా ప్రచారం కల్పించిందా అంటూ విద్యా వేత్తలు ప్రశ్నిస్తున్నారు. కొంత వరకు ప్రశ్నలకు అవకాశం ఇవ్వటం సాధారణంగా జరుగుతూనే ఉందని..ఈ సారి మాత్రం ఉద్దేశ పూర్వకంగానే ఈ ప్రశ్నలు పొందరుపరిచారా అనే అనుమానం వారు వ్యక్తం చేస్తున్నారు. మరి..ఈ విమర్శలకు ఏపీపీఎస్సీ ఏ రకంగా స్పందిస్తుందో..ఎటువంటి సమాధానం ఇస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications