హక్కులుండవ్: వెంకయ్య, ఇప్పుడు ఎన్నికలొస్తే: జగన్
హైదరాబాద్/శ్రీకాకుళం: ఆధునిక టెక్నాలజీతో తీవ్రవాదులు అమాయకుల ప్రాణాలను తీస్తున్నారని, సమస్యలకు మావోయిజం పరిష్కారం కాదని, తీవ్రవాదులకు మానవ హక్కులు వర్తించవని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం అన్నారు. రాష్ట్ర పోలీసు అకాడమీలో ఎంసీటీసీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
పోలీసులు తీవ్రవాదాలకు ధీటుగా శిక్షణ పొందాలన్నారు. దేశంలో పోలీసు వ్యవస్థదే కీలక పాత్ర అన్నారు. సమాజంలో, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలన్నారు. అమాయకుల ప్రాణాలను తీసే తీవ్రవాదులకు మానవ హక్కులు వర్తించవని చెప్పారు. సరిహద్దు తీవ్రవాదం అతి పెద్ద సమస్య అన్నారు.
భారత్ ఆర్థిక వ్యవస్థ పైన దాడి చేసేందుకు తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తీవ్రవాదులకు ధీటుగా శిక్షణ ఉండాలన్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం ఆమోదయోగ్యం కాదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళంలో చంద్రబాబుపై జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు. రుణమాఫీ పైన ప్రభుత్వం రోజుకో మాట చెబుతోందన్నారు. చంద్రబాబు మాటలు ప్రజలను మోసం చేసేలా ఉన్నాయన్నారు. నెల రోజుల్లోనే చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందన్నారు. ఇప్పటి వరకు బాబు తానిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు.