చంద్రబాబుకు జగన్ కు తేడా ఇదే; టీడీపీ హయాంలో వీధికో బెల్ట్ షాప్: ఎంపీ మార్గాని భరత్
వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కావాలని జగన్ మోహన్ రెడ్డి పాలన పై తెలుగుదేశం పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ఇక రాజమండ్రి రాజకీయాలపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగన్ హయాంలో పెరిగిన తలసరి ఆదాయం : ఎంపీ మార్గాని భరత్
గత మూడు సంవత్సరాల దేశ సగటు కంటే మిన్నగా ఏపీ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఎంపీ మార్గాని భరత్ చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఏడాదికి సగటున రాష్ట్ర తలసరి ఆదాయం 12 వేల 25 రూపాయలు పెరిగిందని, కరోనా సంక్షోభంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం 17 వేల 913 రూపాయలకు పెరిగిందని మార్గాని భరత్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానంగా మార్గాని భరత్ పై వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కారు కానీ జగన్ స్వయంకృషితో ఎదిగారు
ఇక ఇదే సమయంలో చంద్రబాబు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కారని, కానీ జగన్ మోహన్ రెడ్డి స్వయంకృషితో అధికారంలోకి వచ్చారని, చంద్రబాబుకు జగన్ కు మధ్య ఉన్న తేడా ఇదే అని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వీధికో బెల్టు షాపు ఉండేదని, కానీ ప్రస్తుతం వైసిపి పాలనలో రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని మార్గాని భరత్ స్పష్టం చేశారు. కేవలం తెలుగుదేశం పార్టీ నేతలు అధికార వైసిపికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ప్రభుత్వం పై దుష్ప్రచారం చేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ మార్గని భరత్ మండిపడ్డారు.

రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికడతాం.. త్వరలో రాజమండ్రి కమీషనరేట్
టూరిజం అభివృద్ధి పై విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్న మార్గాని భరత్ కేంద్ర టూరిజం బడ్జెట్ 2000 కోట్ల రూపాయలు అని, ఆ బడ్జెట్ ఉద్యోగుల జీతాలకే పరిమితమైందని పేర్కొన్నారు. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికడతామని పేర్కొన్న మార్గాని భరత్, త్వరలో రాజమండ్రిలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రౌడీ షీటర్ మాదిరిగా చేతులపై పచ్చ బొట్టు వేయించుకున్న నేత బ్లేడ్ బ్యాచ్ పై మాట్లాడటం విడ్డూరంగా ఉందని, రౌడీషీటర్లను తన దగ్గరకు రానివ్వనని మార్గాని భరత్ స్పష్టంచేశారు.

బ్లేడ్ బ్యాచ్ పై, మార్గాని భరత్ టార్గెట్గా టీడీపీ ఫైర్... సమాధానమిచ్చిన ఎంపీ భరత్
ఇక అసలు విషయం ఏమిటంటే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన రౌతు సూర్యప్రకాశరావు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అత్తింటి కుటుంబంతో బ్లేడ్ బ్యాచ్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ తర్వాత ఎంపీ మార్గాని భరత్ కూడా తన ఎన్నికల ప్రచారంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికడతామని హామీ ఇచ్చారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. ఈ బ్యాచ్ ఆగడాలు మరింత పెరిగాయి. దీంతో టిడిపి నేతలు ఎంపీ భరత్ పది రోజుల్లోగా బ్లేడ్ బ్యాచ్ ను అరెస్ట్ చేయించాలని, లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసరడంతో ఎంపీ మార్గాని భరత్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరి టిడిపి నేతల విమర్శలపై ఎదురు దాడి చేశారు.












Click it and Unblock the Notifications