ఏపీలో విచ్చలవిడిగా గంజాయి దందా.. రెండు రోజుల్లో 670 కేజీలు సీజ్
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటోంది. ముఖ్యంగా ఏపీ కేంద్రంగా గంజాయి దందా యధేచ్చగా సాగుతుంది. గత కొంత కాలంగా విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి ఇతర రాష్ట్రాలకు సైతం అక్రమ రవాణా జరుగుతుంది. గంజాయి స్మగ్లర్లు రూటు మార్చి అర్ధం కాకుండా గంజాయిని తరలిస్తున్నారు. గంజాయి స్మగ్లర్ల ఆగడాలకు అడ్డు కట్ట వెయ్యటం ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద కష్టంగా మారింది.అయితే తాజాగా ఏపీలో గంజాయి స్థావరాలపై ఎక్సైజ్ శాఖ పోలీసులు పంజా విసిరారు.

ఏపీలో రెండు రోజుల్లో 670 కేజీల గంజాయి స్వాధీనం
గంజాయి అక్రమ రవాణా భారీ స్థాయిలో జరుగుతోందని ఇటీవల గంజాయి భారీగా పట్టివేతలు చెప్తున్నాయి. కోట్ల విలువైన సరుకు ఎక్సైజ్,టాస్క్ ఫోర్సు,నార్కోటిక్స్, పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టుకుంటున్నారు. నిన్న విశాఖ రూరల్ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో 430 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈరోజు ఉదయం కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్గేట్ వద్ద మరో 240 కేజీల గంజాయిని టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలో భారీగా గంజాయి పట్టుబడటం ఈ దందా ఎంతగా విస్తరించిందో చెప్తుంది.

మినీ బస్సులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
విశాఖ ఏజెన్సీకేంద్రంగా చాలా కాలంగా మాదక ద్రవ్యాల మహమ్మారి గంజాయి రవాణా కొనసాగుతుంది. ఇక ఈ పట్టుబడిన గంజాయి సైతం విశాఖ నుండి అక్రమార్కులు తరలిస్తున్న గంజాయిలో కొంత మొత్తం ఇది అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఎవరికీ అనుమానం రాకుండా ఓ మినీ బస్సులో గంజాయి తరలించే ప్రయత్నం చేశారు. విశాఖ నుంచి కర్ణాటకకు గంజాయి తరలుతోందన్న సమాచారం అందడంతో పొట్టిపాడు టోల్గేట్ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. బస్సు రాగానే తనిఖీలు నిర్వహించగా గంజాయి లభించడంతో దాన్ని స్వాధీనం చేసుకుని పది మంది నిందితులను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు .

ట్యాంకర్ లో 100 కిలోలు, కార్ లో 60 కిలోలు గంజాయి పట్టివేత
విశాఖ ఏజెన్సీలోని ఇటీవల పలు గంజాయి స్థావరాలపై పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేశారు. నిన్న విశాఖ జిల్లా నర్సీపట్నం-చింతపల్లి రోడ్డులో నెలిమెట్ల కూడలి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా డీజిల్ ట్యాంకు మాదిరిగా ఏర్పాటు చేసిన ట్యాంకర్ లో ప్యాకెట్ల రూపంలో తరలిస్తున్న వంద కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వెనుకే వస్తున్న కారులో నుంచి మరో 60 కిలోలు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి కారు,వ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వాహన తనిఖీల్లో తరచూ పట్టుబడుతున్న గంజాయి
ఇక ఈ గంజాయి దందాలో ఏపీ రాష్ట్రంలోని వారే కాకుండా పక్క రాష్ట్రాల మాఫియా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న విశాఖ జిల్లా పాయకరావుపేటలోని నర్సీపట్నం జంక్షన్లో స్థానిక పోలీసులు వాహన తనిఖీలలో గంజాయి పట్టుబడింది. ఆటోలో తరలిస్తున్న ఆరు బస్తాల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 175 కేజీల బరువున్న దీని విలువ రూ.2 లక్షలు. అదే విధంగా
హుకుంపేట మండలం దిగుడుపుట్టు వద్ద వాహనాలు వాహనతనిఖీల్లో వాహనంలో తరలిస్తున్న 102 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ గంజాయి పట్టుపడుతున్న నేపధ్యంలో సంబంధిత శాఖల అధికారులు అలెర్ట్ అయ్యారు. ఉక్కుపాదం మోపే యత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications