వేట్లపాలెంలో భారీ పేలుడు.. 20 మంది సజీవదహనం
కాకినాడ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలోని వేట్లపాలెం పరిధిలో గోదావరి కాలువ సమీపంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్వర్క్స్ బాణసంచా తయారీ యూనిట్లో శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. భారీగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. ఘటనా స్థలంలో మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాద సమయంలో 35 మంది వరకు అక్క పనిచేస్తున్నారని సమాచారం
పేలుడు తీవ్రత దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. శబ్ద ప్రభావంతో సమీప గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాల భవన స్లాబ్లో పగుళ్లు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది.
మృతుల వివరాలు..
బాణసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులను అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్, గొడతా రాము, గొడతా నానిగా పోలీసులు పేర్కొన్నారు. ఇంకా కొద్ది మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.

ఏపీలో కాకినాడ జిల్లా వేట్లంపాడు, జి.మేడపాడు మధ్యలో ఉన్న బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు.
— Subbu (@Subbu15465936) February 28, 2026
ఈ ఘటనలో 30 మంది కార్మికులకు గాయాలు కాగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. pic.twitter.com/D0QRET4bT5
పేలుడు సంభవించిన సమయంలో భారీ శబ్దం రావడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారికీ అక్కడి పరిస్థితి హృదయ విదారకంగా కనిపించింది. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు ప్రక్రియ సవాలుగా మారింది.
స్థానికుల ప్రకారం, పరిమితికి మించి బాణసంచా తయారీ జరగడం ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనకు గల అసలు కారణాలపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.
సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి..
ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆయనకు ప్రమాద సమాచారం అందడంతో, అక్కడ నుంచే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటి, సంఘటన స్థలంలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఘటన సమయంలో సూర్య ఫైర్ వర్క్స్లో సుమారు 20 మంది వరకు పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో బాణసంచా తయారీదారులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కాకినాడలో జరిగిన ఈ పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం విషాదకరమని పేర్కొంటూ, కార్మికుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పేలుడు ప్రభావంతో చుట్టుపక్కల ఇళ్లు దెబ్బతినడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications