గన్నవరంలో భారీ అగ్ని ప్రమాదం..ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు
కృష్ణాజిల్లా గన్నవరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గన్నవరం మండలం తెంపల్లిలో విజయ పారి మిల్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ సంచులు తయారు చేసే కంపెనీ కావడంతో మంటలు క్షణాల్లోనే ఫ్యాక్టరీ అంతా వ్యాపించాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. ప్లాస్టిక్ సంచులు తయారు చేసే కంపెనీ కావడంతో నల్లని దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా అలముకుంది.
గన్నవరం తెంపల్లిలో ప్లాస్టిక్ సంచుల తయారీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ..
ఈరోజు తెల్లవారుజామున గన్నవరం, తెంపల్లిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉంగుటూరు మండలం రైల్వే గేట్ సమీపంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన కారణాలు కూడా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా ? లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం .. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు
ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా మంటలను అదుపు చేయడం పెద్ద సవాల్ గా మారింది. అందుకు కారణం ప్లాస్టిక్ బ్యాగులు అని భావిస్తున్నారు. విజయ పారి మిల్స్ పరిసర ప్రాంతాలలో దట్టమైన పొగ అలుముకుంది. ప్లాస్టిక్ కావటంతో పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీని పక్కనే పలు ఫ్యాక్టరీలు ఉండటంతో సదరు ఫ్యాక్టరీల వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

అనంతపురంలోనూ అగ్నిప్రమాదం
అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కంపెనీ లోపల ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తున్న నేపథ్యంలో మెటీరియల్ అంతా అగ్నికి ఆహుతి అయి, మొత్తం బూడిదే మిగులుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో మరో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో జేఎన్టీయూ సమీపంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పవిత్ర హైపవర్ మార్ట్ లో అగ్ని ప్రమాదం జరిగింది.

పవిత్ర హై పవర్ మార్ట్ లో అగ్నిప్రమాదం .. 70 లక్షల ఆస్తి నష్టం
పవిత్ర హైపర్ మార్ట్ లో అగ్ని ప్రమాదంతో మంటలు ఎగసిపడగా, దట్టమైన పొగలు రావడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది దాదాపు మూడు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో విపరీతంగా శ్రమించి మంటలను కంట్రోల్ చేశారు. పవిత్ర సూపర్ మార్ట్ లో సరుకులు ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తం 70 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు . విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో అనేది విచారణ చేస్తున్నారు.
Recommended Video

అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అగ్ని ప్రమాదం వల్ల భవనం బాగా దెబ్బతిన్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. పవిత్ర హైపవర్ మార్ట్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎక్కువశాతం అగ్ని ప్రమాద ఘటనలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే జరుగుతుండడం గమనార్హం. అనంతపురంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications