కీలక ఉత్తర్వులు జారీ చేసిన శ్రీలక్ష్మీ- వేల కోట్ల ప్రాజెక్టులు..!!
అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మీ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తోన్న ఆమె- వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు సంబంధించిన నిధులకు పరిపాలనపరమైన అనుమతులను మంజూరు చేశారు. రాష్ట్రాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించే ఉత్తర్వులు అవి.
స్టేట్ క్యాడర్ మార్చుకుని..
శ్రీలక్ష్మి..1988 బ్యాచ్కు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఎఎస్ అధికారి. అప్పట్లో గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు వెళ్లారు. అక్కడ పలు కీలక శాఖల్లో పనిచేశారు. 2019 తరువాత వైఎస్ జగన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆమె ఏరికోరి ఏపీకి పోస్టింగ్ వేయించుకున్నారు. తన స్టేట్ క్యాడర్ను కూడా మార్చుకున్నారు. ఏపీ క్యాడర్కు బదలాయించుకున్నారు.
విప్లవాత్మక మార్పులు..
తన ప్రభుత్వంలో వైఎస్ జగన్.. ఆమెకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ వస్తోన్నారు. కీలకమైన మున్సిపల్ శాఖ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఈ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తోన్నారామె. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగనన్న ఇళ్ల కాలనీ పథకం శ్రీలక్ష్మీ బ్రెయిన్ ఛైల్డ్గా చెబుతుంటారు. రాష్ట్రంలో పట్టణ పరిపాలనలో విప్లవాత్మక మార్పులకూ శ్రీకారం చుట్టారు.పట్టణాల్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు శ్రీలక్ష్మి.
జగన్ ఆధ్వర్యలో..
ఏరికోరి ఏపీకి వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తన క్యాడర్ ను ఏపీకి మార్చుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పని చేయడానికి ఆసక్తిగా ఉండటమే దీనికి కారణం. అదే స్థాయిలో ఆమెను ఆదరిస్తోన్నారు వైఎస్ జగన్. భవిష్యత్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ అవుతారనే ప్రచారం ముందు నుంచీ వినిపిస్తూనే ఉంది.
ఓఎంసీ కేసులో క్లీన్ చిట్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో శ్రీలక్ష్మి సీబీఐ కేసులను ఎదుర్కొన్నారు. కేసులు నమోదు చేశారే గానీ ఆమె అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలను సీబీఐ అధికారులు న్యాయస్థానానికి సమర్పించలేకపోయారు. ఆ కేసులేవీ న్యాయస్థానంలో నిలవలేదు. వాటన్నింటినీ కొట్టి పారేసింది తెలంగాణ హైకోర్టు. ఆమెకు ఊరట కల్పించింది.
వేల కోట్ల రూపాయలతో..
తాజాగా అమృత్ 2.0 పథకం కింద రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల విలువ చేసే పనులకు పరిపాలనపరమైన అనుమతులను జారీ చేశారామె. తొలి విడతలో రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పరిధిలో 3,151 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టడానికి అనుమతి ఇచ్చారు.
15వ ఆర్థిక సంఘం కింద..
ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం వాటా 1,065.59 కోట్ల రూపాయలు. కాగా రాష్ట్రం వాటా 1,189.80 కోట్ల రూపాయలు. పట్టణ స్థానిక సంస్థలు 695.74 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం నుంచి చెల్లిస్తారు. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో చేపట్టాల్సిన 239 అభివృద్ధి పనులకు శ్రీలక్ష్మీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటి విలువ 48 కోట్ల రూపాయలు.