అనురాధ హత్య: గన్మెన్ సెలవు, మొరాయించిన సిసీటివి కెమెరాలు
చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ హత్య పక్కా పథకం ప్రకారం జరిగినట్లు అర్థమవుతోంది. అన్నీ చూసుకునే ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆమె గన్మెన్ సెలవులో ఉన్న సమయం చూసి దుండగులు దాడి చేశారు.
దానికి తోడు నగరపాలక సంస్థ కార్యాలయంలో సిసిటీవీ కెమెరాలు మంగళవారంనాడు పనిచేయడం లేదు. ఇవి పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రత్యర్థులతో తీవ్ర వైషమ్యాలు ఉన్న అనురాధకు, ఆమె భర్త మోహన్కు సరైన భద్రత కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి.
గన్మెన్ లేడని తెలుసుకున్న దుండగులు నేరుగా కార్యాలయంలోకి ప్రవేశించి, కత్తులతో దాడి చేసి, పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. అనురాధపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆస్పత్రికి తరలించేలోగానే ఆమె మృత్యుకౌగిట్లోకి వెళ్లిపోయింది.
ఆమె భర్త మోహన్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆయన ప్రస్తుతం తమిళనాడులోని వేలూరు సిఎంసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన శరీరం నుంచి ఓ బుల్లెట్ తీశారు. అనురాధ హత్యపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
జాగిలాలను పోలీసులు రంగంలోకి దించారు. క్లూస్ టీమ్లు సంఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనురాధ భర్త మోహన్ మేనల్లుడు చింటూపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.