ఏపీలో నయా కుంభకోణం.. మెడికల్ సీట్ల దందా..
ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న మెడికల్ సీట్ల దందా భాగోతం బట్ట బయలైంది. న్యాయపరంగా లోకల్ విద్యార్థులకు దక్కాల్సిన మెడికల్ సీట్లను ముందుగానే బ్లాక్ చేసి, కోట్ల రూపాయలకు నాన్ లోకల్ విద్యార్థులకు అమ్ముకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 100 లోకల్ మెడికల్ సీట్లను నాన్ లోకల్ విద్యార్థులకు కోట్ల రూపాయాలకు అమ్ముకున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా.. కర్నూలు జిల్లాకు చెందిన రమణ అనే వ్యక్తి ద్వారా ఈ నయా కుంభకోణం బయటపడింది. ఆర్టీఐ చట్టం కింద వివరాలు సేకరించిన రమణ సీబీఐకి కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విజిలెన్స్ విభాగం కూడా విషయంపై ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఆధారాల కోసం మెడికల్ కౌన్సిల్ రమణకి లేఖ రాసిందన్న వాదన కూడా వినపడుతోంది.

ఆర్టీఐ చట్టం కింద రమణ సేకరించిన వివరాల ప్రకారం.. కర్నూల్ మెడికల్ కాలేజీ, పద్మావతి యూనివర్సిటీల్లో మెడికల్ సీట్ట అవకతవకలు జరిగాయి. 2015లో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ కౌన్సిల్ లో ఈ కుంభకోణానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి తప్పుడు అఫిడవిట్ల ద్వారా దందా కొనసాగించారు. ఆఖరికి కోర్టు పరిధిలో ఉన్న సీట్లను కూడా కోర్టులకు ఏ మాత్రం అనుమానం రాకుండా కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నారు.
కుంభకోణం గుట్టురట్టు చేసిన రమణ మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఇంత దారుణంగా కౌన్సిలింగ్ నిర్వహించిన విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రమణ. మరి ఏపీ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందో.. లేక చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుందో.. వేచి చూడాలి.












Click it and Unblock the Notifications