పవన్ కళ్యాణ్ వైపు ఫ్యాన్స్, ఎప్పుడొస్తానో: లగడపాటి
హైదరాబాద్: సీమాంధ్రలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోజీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ల ప్రభావం తప్పక ఉంటుందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక అభిమానులందరూ పవన్ కళ్యాణ్ వైపు మళ్లారని అభిప్రాయపడ్డారు. అందువల్ల బిజెపి, టిడిపి కూటమికి ఆయన ప్రచారంతో మంచి ప్రజాస్పందన వచ్చిందన్నారు.
విభజన తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువని, కాబట్టే తెరాసకే మేలు జరిగిందన్నారు. విభజన వల్ల కాంగ్రెస్కు రెండు ప్రాంతాల్లోనూ నష్టం తప్పదని అధిష్ఠానానికి ముందే చెప్పానని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధిస్తుంది.. కానీ, అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో దీన్ని నిలుపుకోవడంలో పార్టీ విఫలమవుతోందన్నారు. నాయకత్వ లోపమే ఇందుకు కారణమన్నారు.

తాను రాజకీయంగా కాంగ్రెస్లోనే పుట్టానని, కాంగ్రెసులోనే మరణించానని చెప్పారు. అందుకు చాలా బాధగా ఉందన్నారు. తనకు పునర్జన్మపై నమ్మకం లేదన్నారు. భవిష్యత్లో రాజకీయాల్లోకి వస్తానో రానో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు. మాజీ సిఎం, జై సమైక్యాంధ్ర పార్టీ చీఫ్ కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యం కోసం సిఎం పదవిని వదులుకున్నారనే అభిమానం, సానుభూతి సీమాంధ్ర ప్రజల్లో ఉన్నాయన్నారు.
పార్లమెంటులోనూ తమ పోరాటంపై ప్రత్యేకాభిమానం కూడా ఉన్నా అది ఓట్లుగా మారుతుందో లేదో చెప్పడం కష్టమన్నారు. సమైక్యాంధ్ర పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే కొంత ప్రభావం ఉండేదన్నారు. తాను ఏ పార్టీలో లేనని, నైతికంగా కిరణ్ పార్టీకి మద్దతిస్తున్నట్లు చెప్పారు. విభజనపై సోమవారం సుప్రీం కోర్టులో ప్రారంభం కానున్న విచారణ ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. ఇది సీమాంధ్రలో పోలింగ్పై పడవచ్చునని పేర్కొన్నారు. విభజన అంశం గురించి తానేమీ పట్టించుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications