10న చంద్రబాబుతో చిరంజీవి భేటీ?
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమరం హోరాహోరీగా జరుగుతోంది. అధికార వైసీపీని ఓడించాలనే ధ్యేయంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జనసేన, బీజేపీని కలుపుకొని కూటమిని ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయం దగ్గరపడేకొద్దీ కొద్దిరోజులుగా ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పవన్ ను ఓడించేందుకు వైసీపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. వాటికి ధీటుగా పవన్ కల్యాణ్ తన ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్లారు.
ఏపీ రాజకీయాలు ఇలా కొనసాగుతున్న తరుణంలో రాజకీయాలకు సంబంధంలేని చిరంజీవి పేరు మాత్రం కొద్దిరోజులుగా మార్మోగిపోతోంది. అధికార పార్టీ నేతలు చిరంజీవిని లక్ష్యంగా ఎంచుకొని విమర్శలు చేస్తున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేస్తున్న సీఎం రమేష్ తోపాటు పెందుర్తి నుంచి జనసేన తరఫున పోటీచేస్తున్న పంచకర్ల రమేష్ బాబు మద్దతు కోసం చిరంజీవిని కలిశారు. వారిని గెలిపించాలని, మంచి వ్యక్తులని, ప్రజాసేవ చేస్తారంటూ ఆయన ఆయా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. అంటే పరోక్షంగా వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్లైంది. దీనిపై వైసీపీ నాయకులు చిరంజీవిపై మాటల తూటాలు పేలుస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న తన సోదరుడు పవన్ కల్యాణ్ ను గెలిపించేందుకు అక్కడ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 10వ తేదీ రాత్రి చిరంజీవి విజయవాడ వస్తున్నారు. తర్వాతరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో కలిసి చిరంజీవి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారంటున్నారు. తర్వాత అదేరోజు విజయవాడలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమాను వీక్షిస్తారు. ఈ సినిమా టీజర్ ను కూడా ఆయనే విడుదల చేశారు. తర్వాత 11వ తేదీన పిఠాపురం వెళ్లే అవకాశం ఉందంటున్నారు. పోలింగ్ 13వ తేదీన జరుగుతుండగా, ప్రచారానికి చివరిరోజైన 11న చిరంజీవి రంగంలోకి దిగుతుండటం విశేషం.












Click it and Unblock the Notifications