మంత్రి మేకపాటి హఠాన్మరణంపై అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు
అమరావతి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా కన్నుమూయడం ప్రజలకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఉన్నత విద్యావంతుడు, వివాదరహితుడిగా పేరున్న గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేస్తోన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తోన్నారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా: మనసు అంగీకరించట్లేదు: పవన్ కల్యాణ్
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. మేకపటి హఠాన్మరణం పట్ల జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాప సూచకంగా- తన తాజా సినిమా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను వాయిదా వేసినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఈ పరిస్థితుల మధ్య అమరావతి పరిరక్షణ సమితి నాయకుడు, ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారిశ్రామిక విధానానికి ముడి పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అనుసరిస్తోన్న విధానాలు, పెట్టుబడులకు మేకపాటి ఆకస్మిత మరణానికి లింక్ పెడుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్- తీవ్ర దుమారం రేపుతోంది. కొలికపూడి శ్రీనివాస్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణాన్ని ప్రభుత్వ హత్యగా కొలికపూడి శ్రీనివాస్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరిస్తోన్న విధానాలు.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశాయని ఆరోపించారు. పెట్టుబడులు రాని రాష్ట్రానికి పరిశ్రమల మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి తీవ్ర ఒత్తిళ్లను అనుభవించారని అన్నారు. ఆ ఒత్తిడే ఆయన మరణానికి కారణమైందంటూ వైఎస్ జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేకపాటి అనుభవించిన ఒత్తిడిని తాము అర్థం చేసుకోగలమని అన్నారు.
ఇది ప్రభుత్వం చేసిన హత్య.
— KOLIKAPUDI SRINIVASA RAO (@rao_kolikapudi) February 21, 2022
ముఖ్యమంత్రి విధానాలు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశాయి. పెట్టుబడులు రాని రాష్ట్రానికి పరిశ్రమల మంత్రిగా, మీరు అనుభవించిన ఒత్తిడి అర్థం చేసుకోగలం. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...... pic.twitter.com/kVRnztbFGf
Recommended Video
కొలికపూడి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆయనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. ఒక నాయకుడి చావును కూడా రాజకీయం చేస్తోన్నారంటూ మండిపడుతున్నారు. మంత్రి మరణాన్ని రాజకీయాలు, ముఖ్యమంత్రిపై ఆరోపణలు, విమర్శలు చేయడానికి వినియోగించుకోవడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నారు. కొలికపూడిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజన్లు.