ఏపీలో రాగల మూడు గంటల్లో..
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మందగించినప్పటికీ ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఒకింత వర్షాలకు లోటు ఉండట్లేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో తరచూ వర్షాలు పడుతున్నాయి.
ఇవే పరిస్థితులు నేడు కూడా కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘవృతమై ఉంటుందని, చల్లటి వాతావరణంతో పాటు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

కోస్తాంధ్రలోని కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడొచ్చు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉంది. అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
రాగల మూడు గంటల్లో.. తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని వివరించారు. జిల్లాలోని సత్యవేడు, సూళ్లూరుపేట, తడ, శ్రీహరికోట తదితర ప్రాంతాల్లో పిడుగులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడపజిల్లాల్లో మేఘవృతమైన వాతావరణం చెదురుమదురుగా పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
ఈదురుగాలులు వీస్తున్నప్పుడు గానీ, పిడుగులు పడుతున్నప్పుడు గానీ శిథిల నివాసాలు, గోడలు, చెట్లు, హోర్డింగుల కింద తలదాచుకోవద్దని ఎస్డీఎంఏ పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు, శ్రామికులు, పశుకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రఖర జైన్ అన్నారు.












Click it and Unblock the Notifications