యుద్ధం ముగిసింది.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గుతాయి..??
పశ్చిమాసియాలో దాదాపు 100 రోజులకు పైగా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. ఇరు దేశాలకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వర్చువల్ పద్ధతిలో సంతకాలు చేశారు. ఈ మేరకు మొత్తం 14 అంశాల ఆధారంగా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఇక ఈ ఒప్పందం తక్షణమే అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం దాదాపు నాలుగు నెలలుగా ఆంక్షల్లో ఉన్న అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి తెరుచుకోనుంది. హార్మూజ్ తెరిచినప్పటి నుంచి 60 రోజుల పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండా అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని ఇరాన్ కల్పించనుంది.
ఇక ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం ఎట్టకేలకు ముగిసిపోవడంతో గ్లోబల్ మార్కెట్ లో ముడి చమురు సరఫరాకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దాంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 78 డాలర్లు కంటే తక్కువకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మిడియట్ ధర కూడా బ్యారెల్ కు 76 డాలర్ల వరకు ఉంది.అయితే జూన్ 18 గురువారం నాటికి మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే ఉన్నాయి. వీటిలో తగ్గుదల కనిపించలేదు. అటు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా రూల్స్ కూడా కఠినంగానే ఉన్నాయి.
పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి భారత్ లో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇటీవల లీటర్ పెట్రోల్ పై రూ.2.6 అలాగే లీటర్ డీజిల్ పై రూ. 2.7 మేర పెరిగాయి. మొత్తంగా యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రూ. 7.5 నుంచి రూ.8 వరకు ఇంధన ధరలు పెరిగాయి. ఇక చమురు కంపెనీల అండర్ రికవరీ(నష్టాలు)లోనూ తగ్గుదల కనిపించినట్లు తాజాగా కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. గతంలో లీటర్ పెట్రోల్ కూ రూ. 24 గా ఉన్న నష్టాలు.. ఇప్పుడు 83 శాతం తగ్గి రూ. 3 కు చేరినట్లు స్పష్టం అవుతోంది. అలాగే లీటర్ డీజిల్ పై రూ. 105 గా ఉన్న నష్టాలు ప్రస్తుతం దాదాపు 75 శాతం తగ్గి రూ. 27 కు చేరినట్లు సమాచారం.

ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102 ఉంది. అలాగే హైదరాబాద్ లో రూ. 115.73 ఉంది. ఇక ముంబైలో రూ. 113.51 గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.01 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 110. 89 గా ఉంది. ఇక లీటర్ డీజిల్ ధర దిల్లీలో రూ. 95.20 గా ఉంది. హైదరాబాద్ లో రూ.103.82 గా ఉంది. బెంగళూరులో రూ. 98.80 గా ఉంది. ముంబైలో రూ. 97.83 గా ఉంది. అలాగే వ్యాట్ కారణంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పెట్రోల్, డీజిల్ మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications