సీఎం - గౌతమ్ శాఖలు ఆ మంత్రులకు : ముఖ్యమంత్రి లేఖ : అసెంబ్లీ వేళ..!!
సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా కీలక శాఖలు నిర్వహిస్తూ హఠాన్మరణం చెందిన గౌతమ్ శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. పరిశ్రమలు..ఐటీ శాఖా మంత్రిగా దాదాపు మూడేళ్ల కాలం పాటు గౌతమ్ రెడ్డి వాటిని పర్యవేక్షించారు. ఆ శాఖలతో పాటుగా స్కిల్ డెవలప్ మెంట్ సైతం ఆయనే చూసుకొనే వారు. మంత్రి ఆకాల మరణంతో ఆ శాఖలు సీఎం పర్యవేక్షణలోకి వెళ్లాయి. అయితే, ఈ నెల 7వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
గౌతమ్ శాఖల కేటాయింపు
దీంతో..సమావేశాల్లో గౌతమ్ నిర్వహించిన శాఖలకు సంబంధించిన ప్రశ్నలు.. చర్చల్లో ప్రభుత్వం తరపున సమాధానం ఇచ్చేందుకు మంత్రులకు సీఎం బాధ్యతలు కేటాయించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి సీఎం జగన్ లేఖ రాసారు. అందులో ఏ శాఖ ఏ మంత్రికి కేటాయించిందీ వివరించారు. తన వద్ద ఉన్న శాఖలతో పాటుగా.. గౌతమ్ నిర్వహించన శాఖలను అయిదుగురు మంత్రులకు అప్పగించారు. అందులో భాగంగా.. సీఎం వద్ద ఉన్న సాధారణ పరిపాలనా శాఖను కురసాల కన్నబాబు కు అప్పగించారు. లా అండ్ ఆర్డర్ ను హోం మంత్రి సుచరితకు కేటాయించారు.
అసెంబ్లీ కార్యదర్శికి సీఎం లేఖ
గౌతమ్ పర్యవేక్షించిన పరిశ్రమలు..ఐటీ శాఖలను మంత్రి సిదిరి అప్పలరాజుకు ఎలాట్ చేసారు. వీటితో పాటుగా పెట్టుబడులు.. స్కిల్ డెవలప్మెంట్ శాఖలను సైతం అప్పలరాజు ను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ప్రవాసాంధ్రుల వ్యవహారాలు - సంబంధాల శాఖతో పాటుగా పబ్లిక్ ఎంరట్ ప్రైజెస్ ను ఆర్దిక మంత్రి బుగ్గనకు అప్పగించారు. సినిమాటోగ్రఫీ శాఖను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పర్యవేక్షించనున్నారు. ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తరువాత ఏపీ కేబినెట్ సమావేశం అయి..పలు కీలక బిల్లులను ఆమోదించనుంది.
Recommended Video
8న అసెంబ్లీలో గౌతమ్ సంతాప తీర్మానం
మరుసటి రోజు 8వ తేదీన సభలో మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. గౌతమ్ కుటుంబం ఇప్పటికే ఉదయగిరిలోని మేకపాటి ఇంజరీంగ్ కళాశాల భవనాలను ప్రభుత్వానికి అప్పగించి..అక్కడ గౌతమ్ పేరుతో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరింది. దీని పైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే విధంగా.. రాజకీయంగా ఆ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత పైన మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. 11న ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన సభలో 2022-23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.