మంత్రిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న మేకపాటి- జగన్కు థ్యాంక్స్- అభివృద్ధి అజెండా ప్రకటన
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ్టికి సరిగ్గా రెండేళ్లు కావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తమ అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల మన్ననలు చూరగొంటుందని మేకపాటి ఆశాభావం వ్యక్తం చేశారు.
Recommended Video
ఏపీలో సంక్షేమంతో పాటే పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుందని పరిశ్రమల మంత్రి మేకపాటి ఈ సందర్భంగా తెలిపారు. ఏపీలో కరోనా కాలంలోనూ 1.58 శాతం అభివృద్ధి నమోదైందని ఆయన వెల్లడించారు. దేశంలో 10 శాతం ఎగుమతులే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2030 సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నట్లు మేకపాటి వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు మేజర్ పోర్టుల నిర్మాణం జరుగుతుందని, 2023 నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తవుతుందని మేకపాటి తెలిపారు. ఇప్పటికే కర్నూలు ఎయిర్పోర్టు ప్రారంభమైందన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఎక్కువగా పని చేస్తుందని, కానీ తక్కువగా చెప్పుకుంటోందని మంత్రి మేకపాటి తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేస్తున్నామని, మూడు కాన్సెప్ట్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలోని పారిశ్రామిక రంగంలో అగ్రస్దానంలో నిలబెడతామని మేకపాటి ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పారిశ్రామిక కారిడార్లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సులభతర అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు.
త్వరలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి మేకపాటి తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.1032 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని మేకపాటి వెల్లడించారు. కరోనా సమయంలో ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనూ ఏపీ ముందుందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తక్కువన్నారు. రాష్ట్రంలో త్వరలో 30 స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్ల మంత్రి మేకపాటి వెల్లడించారు.












Click it and Unblock the Notifications