ఆత్మకూరు స్థానం బై పోల్ : అసెంబ్లీ నోటిఫై - ఈసీకి సమాచారం : రఘురామతో లింకు..!!
మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం షాక్ నుంచి ఇంకా ఎవరూ తేరుకోలేదు. ఏపీ అసెంబ్లీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లా అత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు నోటిఫై చేసింది. గౌతమ్ అంత్యక్రియలు జరిగిన రోజునే నోటిఫై చేసి అధికారికంగా ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. దీంతో..నోటిఫై చేసిన రోజు నుంచి ఆరు నెలల్లోగా ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. గౌతమ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే...మంత్రిగా ఉంటూ హఠాన్మరణం చెందటంతో..మేకపాటి కుటుంబం నుంచి ఎవరైనా బరిలో నిలిస్తే ప్రధాన పార్టీలు పోటీలో పెట్టే అవకాశం లేదు.
ఆత్మకూరులో ఏకగ్రీవమే
స్వతంత్ర అభ్యర్ధులు మినహా ఏ అన్ని పార్టీలు మద్దతిచ్చే అవకాశం ఉంది. అయితే, మేకపాటి కుటుంబం నుంచి గౌతమ్ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అనేది ఇప్పుడు సందేహంగా మారుతోంది. గౌతమ్ బాబాయ్ చంద్రశేఖర రెడ్డి ఇప్పటికే ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు.
గౌతమ్ సతీమణి లేదా గౌతమ్ సోదరుల్లో ఎవరైనా వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇది తేలటానికి మరింత సమయం పడుతుంది. అయితే, ఇంత త్వరగా అసెంబ్లీ నోటిఫై చేయటం వెనుక మరో ప్రధాన కారణం కనిపిస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ రాజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తొలి విడత పూర్తి కాగానే తన పదవికి రాజీనామా చేసి..నరసాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
రఘురామ వ్యవహారం తేలేనా
కానీ, ఆ తరువాత సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వైసీపీ సైతం ఆయన పైన అనర్హత వేటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత రఘురామ పైన వేటు దిశగా వైసీపీ ఒత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోది.
వైసీపీ కోరుకుంటున్న విధంగా అనర్హ వేటు పడితే రాజకీయంగా రఘురామ నష్టపోతారు. దీంతో..ఆ పరిస్థితి ఎదురవుతుందని భావిస్తే..రఘురామ ముందుగానే రాజీనామా చేసే అవకాశం ఉంటుంది. ఆయన నర్సాపురం నుంచి బరిలో దిగటం ఖాయమని ఇప్పటికే స్పష్టం చేసారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా... అక్కడ వైసీపీ అభ్యర్ధి వర్సెస్ రఘురామ అన్నట్లుగా పోటీ మారే అవకాశం ఉంది.
వైసీపీ అంచనాలతోనే ముందుగా
దీంతో..ఆ సమయంలోనే ఆత్మకూరు స్థానం సైతం భర్తీ చేసుకోవాలనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. అందులో భాగంగానే... అటు ఆత్మకూరు అసెంబ్లీ..ఇటు నర్సాపురం లోక్ సభకు ఒకే సారి ఎన్నికలు జరిగే విధంగా ముందుగానే ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చినట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. ఆత్మకూరులో ఏకగ్రీవం అయినా.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్..నామినేషన్ల దాఖలు కు మాత్రం షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, రఘురామ రాజు తనకు అన్ని పార్టీలు మద్దతిస్తాయని..తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలో వెల్లడిస్తానని గతంలోనే చెప్పారు.
Recommended Video
ఏపీలో మరోసారి బై పోల్స్ వచ్చేనా
తాజాగా, నర్సాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకార సభ నిర్వహించారు. ఆయన మార్చి 13న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కీలక నిర్ణయాలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. ఆయన బీజేపీతో కొనసాగుతారా.. లేక, ఇప్పటికే పొత్తు కోరుకుంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చిన టీడీపీతో కలుస్తారా అనేది స్పష్టత వస్తుందని పాలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. దీంతో..రానున్న రోజుల్లో అటు లోక్ సభ స్పీకర్... రఘురామ రాజు తీసుకొనే నిర్ణయాలు ఉప ఎన్నికల దిశగా ఉంటాయా లేదా అనేది తేలాల్సి ఉంది.