ఆత్మకూరు ప్రచారంలోకి మేకపాటి - సీఎం జగన్ తో భేటీ : ఎవరు పోటీకి దిగినా..!!
మేకపాటి కుటుంబం మరోసారి ప్రజల్లోకి వచ్చింది. మంత్రిగా ఉన్న సమయంలోనే గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో విషాదంలో మునిగిన ఆ కుటుంబం ..తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గౌతమ్ మరణం తరువాత సీఎం జగన్ మూడు సార్లు నెల్లూరు వెళ్లి..ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక, ఇప్పుడు గౌతమ్ ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ క్షణమైనా ఉప ఎన్నిక షెడ్యూల్ విడదుల అయ్యే అవకాశం ఉంది. దీంతీో... ఆత్మకూరు నుంచి గౌతమ్ రెడ్డి వారసుడిగా ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని బరిలోకి దించాలని మేకపాటి కుటుంబం నిర్ణయించింది. ఇప్పటికే ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కు సమాచారం ఇచ్చారు. కాగా, ఇప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తన రెండో కుమారుడు విక్రమ్రెడ్డితో కలసి ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు.

షెడ్యూల్ కు ముందే ప్రచారంలోకి
విక్రమ్ ఆత్మకూరు నుంచి ప్రజా సేవకు మమేకం అవుతారని రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. తాను ఇప్పటి వరకు వ్యాపార రంగంలో నిమగ్నమయ్యానని.. తాను రాజకీయాల్లోకి ప్రవేశించి సోదరుడు గౌతమ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మేకపాటి విక్రమ్రెడ్డి చెప్పుకొచ్చారు. గౌతమ్ నియెజకవర్గానికి ఏం చేయాలనుకున్నారో..వాటిని పూర్తి చేస్తానని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందనేది కాకుండా... నియోజకవర్గం లో పర్యటన ప్రారంభిస్తానని వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబం ఆశీస్సులు తీసుకుంటానన్నారు. రాజకీయాల్లో తనకు సీఎం జగన్ రోల్ మోడల్ గా పేర్కొన్నారు. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారో తెలుస్తుందన్నారు.

పోటీ ఉన్నా.. లేకున్నా.. ప్రజలతో
పోటీ పెట్టాలా.. వద్దా.. అనేది ఆయా పార్టీల ఇష్టమన్నారు. తొలుత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయించిన విధంగా నియోజకవర్గంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం సైతం ఆత్మకూరు నియోజకవర్గంలో విక్రమ్ రెడ్డి నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అభ్యర్దిని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. టీడీపీ - జనసేన తమ అభ్యర్ధులను బరిలోకి దింపే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో.. బద్వేలు బై పోల్ తరహాలోనే ఈ ఉప ఎన్నిక సైతం వైసీపీ వర్సస్ బీజేపీగా జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

సీఎం జగన్ తో మేకపాటి భేటీ
మంత్రి హోదాలో ఉంటూ గౌతమ్ మరణించటంలో ఆ కుటుంబం నుంచి ఎన్నికల్లో నిలిచిన వారిని ఏకగ్రీవం గా గెలిపించటం ద్వారా గౌతమ్ కు నివాళి అర్పించినట్లు అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, బీజేపీ మాత్రం తమది జాతీయ పార్టీ కావటంతో..తమ విధానాలు వేరుగా ఉంటాయని..రాజకీయంగా పోటీ ఉంటుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో...వారంలోగా ఆత్మకూరు బై పోల్ షెడ్యూల్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక, షెడ్యూల్ వస్తూనే... ముఖ్యమంత్రి జగన్ ఆత్మకూరు బై పోల్ గురించి పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఆత్మకూరులో ఇప్పుడు గౌతమ్ సోదరుడు విక్రమ్ పర్యటనలు ప్రారంభిస్తున్న సమయంలో.. నియోజకవర్గ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications