టీడీపీలోకి సుచరిత - భర్తతో పాటే అడుగులు..!?
మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వైసీపీ వీడుతున్నారా. వైసీపీని వీడేది లేదని పదేపదే చెబుతూ వచ్చిన సుచరిత ఆలోచనల్లో మార్పు వచ్చింది. సుచరిత భర్త టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో, భర్తతో పాటుగా సుచరిత కూడా పార్టీ మారేందుకు సిద్దమయ్యారని సొంత వర్గంలోనే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. తొలి నుంచి సీఎం జగన్ కుటుంబం పైన విధేయతతో ఉన్న సుచిరత..మంత్రి పదవి కోల్పోయిన సమయం నుంచి పార్టీతో కొంత అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో భర్త అడుగు జాడల్లో టీడీపీలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారని గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది.
సుచరిత తాజా వ్యాఖ్యలతో కలకలం..
మేకతోటి సుచరిత తొలి నుంచి వైఎస్ కుటుంబం పైన అభిమానంతో ఉన్నారు. 2019లో జగన్ సీఎం అయిన తరువాత హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రి వర్గ విస్తరణలో సుచరితను తప్పించారు. అప్పటి నుంచి సుచరిత మనస్తాపంతో ఉన్నారని అనుచర వర్గం చెబుతోంది. మంత్రి పదవి కోల్పోయిన సమయంలోనే అనుచరులు ఆందోళన చేసారు. ఆ తరువాత తాడేపల్లికి వెళ్లి ముఖ్య నేతలతో సుచరిత సమావేశమయ్యారు. తనకు మంత్రి పదవి పోయినందుకు ఎటువంటి బాధ లేదన్నారు. ఆ తరువాత జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. తాజాగా, సుచరిత చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. పరోక్షంగా తన భర్త వేరే పార్టీలో చేరుతున్నారనే విషయం చెప్పకనే చెప్పారు. భర్త మరో పార్టీలో ఉంటాను..నా తో రా అంటే వెళ్లాల్సిందేగా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, సుచరిత తన భర్తతో కలిసి రాజకీయంగా కొత్త నిర్ణయం ప్రకటించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారనే సంకేతాలు బలపడ్డాయి.
టీడీపీలోకి వెళ్తారంటూ ప్రచారం..
సుచరిత భర్త దయాసాగర్ కు టీడీపీ నుంచి ఎంపీ సీటు పైన హామీ దక్కిందని ప్రచారం సాగుతోంది. సుచరిత భర్త దయాసాగర్ ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పని చేసి పదవీ విరమణ చేసారు. ఇప్పుడు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. వచ్చే ఎన్నికల్లో సుచరిత -దయాసాగర్ కు ఇద్దరికీ వైసీపీలో సీట్లు ఇవ్వటం పైన ఎటువంటి హామీ దక్కలేదని సమాచారం. సుచరిత వరకు మాత్రమే తిరిగి సీటు ఖాయమని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. దయాసాగర్ కు సీటు ఇవ్వటం పైన హామీ రాకపోవటంతో..టీడీపీ వైపు చూస్తన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి సుచరిత తో పాటుగా దయాసాగర్ కు టికెట్ పైన హామీ వచ్చిందని చెబుతున్నారు. దయాసాగర్ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. టీడీపీ నుంచి పోటీ చేయటం పైన ఆసక్తిగా ఉన్నారు. ఆ దిశగా జరిగిన ప్రయత్నాల్లో ఆయనకు టీటీడీ ఎంపీ టికెట్ దాదాపు ఖాయమని తెలుస్తోంది. భార్యగా భర్త వెంట అడుగులు వేసేందుకు సుచరిత సిద్దమయ్యారని చెబుతున్నారు. తాజాగా సుచరిత చేసిన వ్యాఖ్యల వెనుక పరమార్ధం కూడా అదేనంటూ చర్చ సాగుతోంది.
రాజకీయ మనుగడ వైసీపీతోనే అంటూనే...
సుచిరత తాజాగా తన నియోజకవర్గం కార్యకర్తల అంతర్గత సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. కుటుంబమంతా ఒకే పార్టీలో ఉంటుంది కానీ వేర్వేరు పార్టీల్లో ఉండబోదని సుచరిత స్పష్టం చేశారు. భర్త పార్టీ మారతారన్న ప్రచారాన్ని ఆమె ఖండించకపోగా.. ఆయన వెంటే నడుస్తానని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా తన రాజకీయ మనుగడ వైసీపీతోనే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో, సుచరిత వైసీపీలోనే ఉంటారనే అంచానలు వ్యక్తం అయ్యాయి. కానీ, మంత్రివర్గ విస్తరణలో తన సామాజిక వర్గానికి చెందిన వారిని కొనసాగించి తనను తప్పించటం పై అప్పట్లో సుచరిత మనస్థాపానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి..కొత్తగా వచ్చిన నేతకు అప్పగించారనే అంశంపైన చర్చ జరిగింది. ఇక, ఇప్పుడు సుచరిత పార్టీ మారటం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా టీడీపీ వైపు తన భర్త ప్రయాణం ఖరారు కావటంతో..భర్తతో పాటుగా తాను అడుగులు వేయాలని సుచరిత నిర్ణయించినట్లు సమాచారం.