ఉండవల్లి శ్రీదేవి ఎఫెక్ట్ - సుచరిత కీలక నిర్ణయం..!?
ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో పోటీ పైన కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ,జనసేన పొత్తుతో ఆ రెండు పార్టీల్లో అభ్యర్దుల ఖరారు పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో వైసీపీలో సీఎం జగన్ తన అభ్యర్దుల ఎంపిక కసరత్తు కొనసాగిస్తున్నారు. వైసీపీ సీనియర్లు కొందరు ఎన్నికల వేళ కీలక ప్రతిపాదనలు చేస్తున్నారు. మాజీ హోం మంత్రి సుచరిత కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
మారుతున్న సమీకరణాలు : ఏపీలో సీఎం జగన్ వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఈ కీలక పోరులో ప్రతీ సీటు కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ అడుగుల్లోనే నడుస్తున్న మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ ఎన్నికల్లొ పోటీ పైన కొంత డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి సుచరిత ఒకసారి కాంగ్రెస్ తరఫున,రెండుసార్లు వైసీపీ తరఫున గెలుపొందారు. 2019 లో గెలిచిన తరువాత జగన్ కేబినెట్ లో హోం మంత్రిగా పని చేసారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో సుచరిత పదవి కోల్పోయారు. ఆ సమయంలోనే సుచరిత అనుచరులు ఆందోళనకు దిగారు. కానీ, తరువాత జగన్ ను కలిసిన సుచరిత తనకు ఎటువంటి బాధ లేదని చెప్పుకొచ్చారు.
సుచరిత పోటీ ఎక్కడి నుంచి : ఇక, ఇప్పుడు తిరిగి ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో సుచరిత పోటీ పైన మరోసారి చర్చ మొదలైంది. ఈ ఎన్నికల్లో సుచరిత పోటీ చేయరని..రాజకీయాలకు దూరంగా ఉండొచ్చని ఓ దశలో ప్రచారం సాగింది. కానీ, పార్టీ నాయకత్వం సూచన మేరకు పోటీకి అంగీకరించారు. సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి ఇప్పుడు పోటీ వద్దని మరో నియోజకవర్గం వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈ మధ్య కాలంలోనే సుచరిత భర్తకు వైసీపీ ప్రభుత్వం మచిలీపట్నం పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. దీంతో, సుచరిత ప్రత్తిపాడు నుంచి కాకుండా తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీకి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. 2019లో తాడికొండ నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనకూలంగా ఓటు వేసి వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం టీడీపీకి దగ్గరయ్యారు. దీంతో, తాడికొండ నుంచి సుచరిత బరిలోకి దిగేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

సీఎం జగన్ కసరత్తు : ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్దిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు పేరు దాదాపు ఖరారైంది. ఇదే సమయంలో ఈ నియోజకవర్గం నుంచి 2014లో గెలిచి మంత్రిగా పని చేసిన రావెల కిశోర్ బాబు వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తాడికొండ సీటు పైన కత్తెర సురేశ్ తో పాటుగా మాజీ మంత్రి డొక్కా మణిక్య వర ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
డొక్కా గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో, ఇప్పుడు సుచరిత ఆశిస్తున్నట్లుగా సీఎం జగన్ తాడికొండ సీటు ఇస్తారా లేక ప్రత్తిపాడు నుంచే పోటీ చేయాలని సూచిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం వేళ..గుంటూరు జిల్లాలో వైసీపీ అభ్యర్దుల ఎంపిక..పోటీ అంశంలో ప్రతీ అంశం కీలకంగా మారుతోంది. దీంతో, సీఎం జగన్ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications