అసభ్య ప్రవర్తన, చితకబాదారు: హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని ద్వారకానగర్లో మూడేళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి స్థానికులు శుక్రవారం నాడు దేహశుద్ధి చేశారు. చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో రాజేష్ అనే వ్యక్తి పాపకు మాయమాటలు చెప్పి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతనిని చితకబాదారు.
హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైకోర్టులో ఓ వ్యక్తి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు విచారణకు రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి హైకోర్టులోని హాల్ నెంబర్-8 వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బయటే కిరోసిన్ పోసుకుని వచ్చిన ఆయన తనకు పోలీసుల వల్ల అన్యాయం జరుగుతోందని, న్యాయం చేయాలని కేకలు వేస్తూ నిప్పంటించుకున్నాడు. అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. అతనిని ఆస్పత్రికి తరలించారు.
మల్కాజ్గిరి ఇళ్లలో భారీ చోరీ
మల్కాజ్గిరి పీఎస్ పరిధిలోని ప్రేమ్విజయ్నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఈ ప్రాంతంలోని రెండిళ్లలోకి చొరబడిన దొంగలు ఐదు తులాల బంగారంతో పాటు ఏడు లక్షల రూపాయలు అపహరించుకుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బోడిబండ్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.