ఏపీకి భారీ వర్షాలు : కృష్ణా వరద ఉధృతి: తాజా హెచ్చరికలు..!!
తెలుగురాష్ట్రాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లా అతలాకుతలం అయింది. ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలోనే వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. ఈనెల 18 వ తేదీన ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ఆవర్తనం అక్టోబర్ 20 వ తేదీకి అల్పపీడనంగా మారుతుందని, ఈ అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు పయనమౌతుందని ఆ తరువాత ఇది తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఈ తుఫాన్కు చిత్రాంగ్ గా నామకరణం చేశారు. గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఈ సూపర్ సైక్లోన్ అవకాశాలను గుర్తించింది. ఈ తుఫాన్ సూపర్ సైక్లోన్గా మారితే దాని ప్రభావం ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద ప్రవాహం వస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ముంపు ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యారు.
కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. విశాఖ నగరంతో పాటుగా కాకినాడ - కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications