హైదరాబాద్ మెట్రో రైలు: కెసిఆర్ వర్సెస్ ఎల్ అండ్ టీ
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులో మెట్రో రైలు పనులు ఆగిపోయాయి. చారిత్రక కట్టడాలున్న రెండు మార్గాల్లో భూగర్భ మెట్రో పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి సూచించారు. అయితే, భూగర్భ మార్గం సాధ్యం కాదని ఎల్ అండ్ టీ చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. కెసిఆర్ చారిత్రక కట్టడాలు దెబ్బ తినకుండా భూగర్భ మార్గాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపై పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే పలు ఫిల్లర్లను ఎల్ అండ్ టీ నెలకొల్పింది. అయినప్పటికీ పనులను ఆపేసింది. మొదట సర్వే చేపట్టి, దాని నుంచి వచ్చే ఫలితాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఎల్ అండ్ టీ నిర్ణయించింది. ఇందుకు సంస్థ ఓ కమిటీని కూడా వేసింది.
చారిత్రక కట్టడాలున్న ప్రదేశాల్లో నిపుణుల బృందం అధ్యయనం చేయాల్సి ఉన్నందున మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ, లక్డీకా పూల్ మార్గాల్లో మెట్రో రైలు పనులు ప్రస్తుతం ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ మార్గాల్లో సోమవారం తాత్కాలికంగా కొన్ని బారికేడ్లను తొలగించారు. ఈ మార్గంలో సర్వే పూర్తయి, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
భూగర్భ మెట్రో సాధ్యాసాధ్యాలపై హెచ్ఎంఆర్, ఎల్ అండ్ టీ సంస్థలు ఓ సంయుక్త నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జెబిఎస్ - ఫలక్నుమా మార్గంలో సుల్తాన్ బాజర్ ప్రాంతంతో పాటు ఎల్బీనగర్ - మియాపూర్ మార్గంలోని ఎంజె మార్కెట్, గన్పార్క్ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితిలోనూ భూగర్భం మార్గం వేయాలని కెసిఆర్ శాసనసభలో ప్రకటన చేశారు.
భూగర్భం మెట్రో సాధ్యం కాదని మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ముఖ్యమంత్రి కెసిఆర్కు లేఖ రాసినట్లు వచ్చిన కథనాలు కలకలం సృష్టించాయి. తాము ఎటువంటి లేఖ రాయలేదని ఎల్ అండ్ టీ వర్గాలంటున్నాయి.
భూగర్భ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని ఎల్ అండ్ టీ సోమవారం తెలిపింది. ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు, అందులో ప్రస్తావించిన పనులు విధిగా పూర్తి చేస్తామని తెలిపాయి. ఒప్పందానికి విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టలేమని అంటున్నట్లు సమాచారం.