రాష్ట్రాన్ని మరోసారి హెచ్చరించిన వాతావరణ శాఖ
వాతావరణశాఖ ఏపీకి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.. నేడు కూడా కురుస్తాయని తెలిపింది. ఈ ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలకు కారణమవుతుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, మరో 24 గంటల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమల్లోని ఏజెన్సీ ప్రాంతం, శివారు ప్రాంతాల్లో చలి పులి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం లేదంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు కమ్మేస్తోంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మిగ్ జాం తుఫాన్ తర్వాత నుంచి ఈ చలి వాతావరణం మరింతగా పెరిగింది. ఈ ప్రాంతాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా పడిపోతున్నాయి. చల్లటి గాలులకు తోడు పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
పొగమంచు వల్ల వాహనదారులు చిన్న చిన్న ప్రమాదాలకు గురవుతున్నారు. మిగ్ జాం తుఫాను వల్ల పంట చేతికందే సమయానికి పొలంలోనే పాడైపోయిందని, పంట నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు. మరో ఆపరితల ఆవర్తనం ఏర్పడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా తీసుకునే చర్యలకు తాము సహకరిస్తామని రైతన్నలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications