వాటన్నింటినీ కెలుకుతూ మైండ్ గేమ్: రోజా మీదనా, జగన్ మీదనా?
ఒళ్లంతా నోరు చేసుకుని చంద్రబాబుపై, తెలుగుదేశం నాయకులపై విమర్శనాస్త్రాలు రోజా సంధిస్తూ ఉంటారు.వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బహుశా దానివల్లనే ఆమెను ప్రోత్సహిస్తూ ఉండవచ్చు.
Recommended Video
హైదరాబాద్: నోరున్న ఆడది అని ఓ ప్రముఖ కథా రచయిత అటువంటి మహిళలోని సానుకూల వైఖరిని తెలియజేస్తూ ఓ కథ రాశారు. అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు రోజాకు సరిపోతుందో లేదో తెలియదు. ఒళ్లంతా నోరు చేసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, తెలుగుదేశం నాయకులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బహుశా దానివల్లనే ఆమెను ప్రోత్సహిస్తూ ఉండవచ్చు. ఆమెను ఎదుర్కునే బాధ్యతను చంద్రబాబు ప్రత్యేక తమ పార్టీ ఎమ్మెల్యే అనితకు అప్పగించారు. కేవలం ఆమె మాత్రమే కాకుండా బొండా ఉమామహేశ్వర రావు వంటి మరికొంత మంది నాయకులు కూడా ఆమెపై జబర్దస్త్ షోలో ఆమె ప్రదర్శనను, సినిమాల్లో వేషాలను గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.
తాజాగా, ఆమెపై మరో విధమైన ప్రచారం ప్రారంభమైంది. ఆ ప్రచారం చాలా రోజులుగా ఉన్నదే. కానీ దానికి కార్యకారణ సంబంధాలను అంటగడుతూ ప్రచారం సాగిస్తున్నారు. నంద్యాలలోనూ, కాకినాడలోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమి ఆమెపై ఈ విధమైన ప్రచారం చేయడానికి అవకాశం కల్పిస్తోంది. ఒక రకంగా అది మైండ్ గేమ్ అనుకోవాలి. ఈ మైండ్ గేమ్ రోజా మీదనా, జగన్ మీదనా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం.
రోజా కాలు పెడితే....
రోజాపై సోషల్ మీడియా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి శనివారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలోని ప్రారంభ వాక్యాలు ఇలా ఉన్నా. "అపజయం ముందు పుట్టి రోజా ఆ తరువాత జనం మరోసారి విసుక్కుంటున్నారు. ఎవరి నమ్మకాలు వారివనుకోండి. అయితే రోజా ఎక్కడ కాలు పెట్టినా అది నాశనం అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు సెటైర్లుగా వచ్చి జనాన్ని అవునా...అనిపిస్తోంది".
చంద్రబాబు అలిపిరి ప్రమాదానికి కూడా..
చంద్రబాబుపై నక్సలైట్లు అలిపిరిలో దాడి చేయడాన్ని కూడా రోజాకే అంటగడుతూ నెటిజన్లు ఇలా అంటున్నారంటూ ఆంధ్రజ్యోతి వార్తాకథన రాసింది. "చాంపియన్ ట్రోఫీకి ముందు అమ్మగారు బ్యాటు పట్టుకున్నారో లేదో ఇండియా నాశనం...దారుణ ఓటమిపాలైంది. తెలుగుదేశం పార్టీలో అమ్మగారు చేరాలనుకున్నారో లేదో ఆ పార్టీకి, దాని నాయకుడికి దరిద్రం పట్టుకున్నట్టైంది. ఆ పార్టీలో చేరాలనుకుని మంతనం చేశారో లేదో చంద్రబాబు అలిపిరి వద్ద నక్సలైట్ల మందు పాతర ప్రభావంతో దారుణంగా గాయాలపాలయ్యారు" అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తునారంటూ ఆ వార్తాకథనం చెప్పింది. "2004లో రోజా పార్టీలో చేరిందో లేదో గెలవాల్సిన తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది" అని రాశారు.
వైఎస్ హెలికాప్టర్ ప్రమాదానికీ...
ఆ తరువాత కాంగ్రెస్లో చేరడానికి రోజా ట్రై చేస్తున్న తరుణంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూశారని మరికొంత మంది నెటిజన్లు గుర్తు చేస్తున్నారని ఆంధ్రజ్యోతి రాసింది. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ తన పార్టీలోకి ఆమెను రానివ్వలేదని వినికిడి అంటూ కాస్తా ఉప్పూకారం కూడా దట్టించింది. "ఆ టైమ్లో జగన్ ఆమెను వైసీపీలోకి చేర్చుకుని ఆదరించారు. దెబ్బకి సీఎం కావాల్సిన వాడల్లా ఏడాదిన్నర జైళ్లో గడిపాడు. రోజా మాత్రం ఇవ్వన్నీ కప్పిపుచ్చుకోడానికి చంద్రబాబును, లోకేశ్ను చెడామడా తిడతారు" అని నెటిజన్లు అంటున్నారు.
రోజా ఐరన్ లెగ్...
"ఇప్పుడు నంద్యాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న ఆశాభావంతో ఎంతో ఊరేగింది. కానీ రోజా ఐరెన్ లెగ్ దెబ్బకి కుప్పకూలిపోయింది. నా నోట్లో మంచిమాటలు రావు... మాట్లాడేటప్పుడు వినండి అంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను శాసించిన రోజా జగన్ను క్రీస్తుగా, అల్లాగా, కృష్ణుడిగా వర్ణించింది" అని నెటిజన్లు అంటున్నారని ఆంధ్రజ్యోతి వార్తాకథనం. మహిళ అని కూడా చూడకుండా తను ఎదిగిపోతాననే భయంతో అంతా ఐరెన్ లెగ్ అంటున్నారని రోజా అంటున్నారు.
మైండ్ గేమ్ కావచ్చునా....
ఇప్పుడు ప్రత్యేకంగా అన్ని పార్టీలకూ సోషల్ మీడియా విభాగాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కూడా బలమైన వింగ్ ఉంది. మైండ్ గేమ్ ఆడేందుకు, ప్రజలను తమ పార్టీవైపు ఆకర్షించేందుకు ఆ వింగ్ నిత్యం పాటుపడుతూ ఉంటుంది. రోజాపైనే కాకుండా వైయస్ జగన్పై కూడా ఇలా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కార్యకర్తలు పనిచేస్తున్నారనే అనుమానాలు రాకపోవు. రోజాను నిష్క్రియాపరురాలని చేయడమే కాకుండా రోజాను వదిలించుకునేందుకు జగన్ను సమాయత్తం చేసే ఎత్తుగడలో భాగంగానే ఈ విధమైన ప్రచారం ప్రారంభమైందని అనుకోవడానికి వీలు కలుగుతోంది.