ఏపీలో మళ్లీ మైనింగ్ మాఫియా- జగన్ సర్కార్ భయం దేనికి ? టీడీపీ నేతల్ని అడ్డుకోవడం వెనుక
ఏపీలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయా ? వాటిని అడ్డుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలమవుతోందా ? మైనింగ్ ప్రాంతాలకు వెళ్తున్న టీడీపీ నేతల్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోంది ? గతంలో విశాఖ మన్యంలో బాక్సైట్ మైనింగ్ జరుగుతోందంటూ పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతల్ని ప్రభుత్వం అడ్డుకున్నా.. నిన్న జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో కొండపల్లి అడవుల్లోకి వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసులు కూడా కలకలం రేపుతున్నాయి.
ఏపీలో మళ్లీ మైనింగ్ మాఫియా
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ మాఫియా ప్రభావం అధికంగా ఉండేది. ఇసుక, ఖనిజాల నుంచి ప్రతీ దాన్నీ తవ్వేసేవారు. వీటిని అడ్డుకునేందుకు అప్పటి చంద్రబాబు సర్కారు సీరియస్ గా ప్రయత్నించకపోవడంతో విపక్షంలో ఉన్న వైసీపీ ప్రతి రోజూ విమర్శలు చేసేది. చివరికి ప్రజాగ్రహంతో టీడీపీ 2019 ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ విశాఖ మన్యంలో బాక్సైట్ లీజుల్ని రద్దు చేయడంతో మైనింగ్ మాఫియా ఆటలు సాగవని అంతా అనుకున్నారు. కానీ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని గమనిస్తుంటే ఏపీలో మైనింగ్ మాఫియా తిరిగి విజృంభిస్తోందని అర్ధమవుతోంది.
టీడీపీ పర్యటనలతో ఉక్కిరిబిక్కిరి
రాష్ట్రంలో మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో టీడీపీ నేతలు వరుస పర్యటనలు చేపడుతున్నారు. గతంలో విశాఖ మన్యంలో జరుగుతున్న బాక్సైట్ మైనింగ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలు.. ఇప్పుడు కృష్ణా జిల్లా కొండపల్లి ఫారెస్ట్ లో వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా కొండపల్లి ఫారెస్ట్ లోకి వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమ, అనుచరుల వాహనాలపై మైనింగ్ మాఫియా రాళ్ల దాడి చేసింది. ఆ తర్వాత ఉమపైనే పోలీసులు కేసులు హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఇవాళ తిరిగి అదే ప్రాంతానికి వెళ్లేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సిద్ధం కాగా పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులతో వారిని అడ్డుకున్నారు.
జగన్ సర్కార్ భయం దేనికి ?
రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటుతో మైనింగ్, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సర్వాధికారాలు కట్టబెట్టింది. అయినా మైనింగ్ మాఫియా కార్యకలాపాలకుూ అడ్డుకట్ట పడటం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీడీపీ నేతల పర్యటనల్ని ప్రభుత్వం అడ్డుకోవడాన్ని బట్టి చూస్తే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం చెప్పకనే చెబుతున్నట్లయింది. మైనింగ్ జరిగే ప్రాంతాలకు వెళ్తున్న టీడీపీ నేతలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం ద్వారా వారిని అడ్డుకునేందుకు వైసీపీ సర్కార్ ఎందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానాలు మొదలయ్యాయి.
Recommended Video
ఎస్ఈబీ విఫలమైందా ?
రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్టే వేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఇప్పటివరకూ భారీగా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. అదే సమయంలో మైనింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నట్లు ప్రభుత్వానికి ఇంటిలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇదే పని కోసం నియమించిన ఎస్ఈబీ బృందాలు అక్రమ మైనింగ్ ను కనిపెట్టలేకపోతున్నాయా లేక దొరికినా కఠిన చర్యలు తీసుకోలేని పరిస్ధితి ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో విపక్ష టీడీపీ పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ పై పోరాటానికి సిద్ధమవుతోంది.