నువ్వు కూడా నాలా జంపు జిలానీవే...మంత్రి ఆదికి ఫిరాయింపు ఎమ్మెల్యే ఝలక్
కడప జిల్లా:మంత్రి ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి బద్వేలు ఎమ్మెల్యే జయరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆది తమపై పెత్తనం చేయాలని చూస్తే, అణగదొక్కాలని చూస్తే సహించేది లేదన్నారు.
శనివారం పోరుమామిళ్లలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జయరాములు, వైవీయూ పాలక మండలి సభ్యురాలు విజయజ్యోతి మాట్లాడారు. ఈ సందర్భంగా జయరాములు మాట్లాడుతూ మంత్రి ఆదిపై, మాజీ ఎమ్మెల్యే విజయమ్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులమని చిన్న చూపు చూడొద్దన్నారు. మంత్రి అయినంత మాత్రాన ఏదో గొప్పగా ఫీలవ్వద్దని, నువ్వూ నాలాగా జంప్ జిలానీవే అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే జయరాములు ఇంకా ఏమన్నారంటే?
జయరాములు...సంచలనం
బద్వేలు ఎమ్మెల్యే జయరాములు మంత్రి ఆది ని ఉద్దేశించి మాట్లాడుతూ నువ్వూ నాకు లా గా జంపు జిలానీవే... అభ్యర్థులకు టికెట్లు నిర్ణయించేది అధిష్ఠానం... నువ్వూ, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కాదు...మీరు మాకు సైకిల్ ర్యాలీ గురించి చెప్పారా?... మా హక్కులు కాలరాయాలని చూస్తారా? దళితులమని చిన్నచూపు చూస్తే సహించేది లేదని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు మంత్రి ఆదినారాయణరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం సంచలనం సృష్టించింది.
మీ సంగతి...అందరికీ తెలుసు
ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ శుక్రవారం మీరేం చేశారో ఆ జరిగిన సంఘటన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసిందన్నారు. నిమ్మకులాల వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి మాట్లాడారన్నారు. విజయమ్మ మీద అభిమానం ఉంటే, ఆమెకు చీర, సారె ఇచ్చి సన్మానించుకోవాలని, అంతే తప్ప నోటికి ఎలా వస్తే అలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను కాలరాయడాని కి మీరెవరని జయరాములు ప్రశ్నించారు. ఇక్కడ జరిగినవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.
కలపమంటే...కలహాలా
అనంతరం పార్టీ మహిళా నేత,వైవీయూ పాలక మండలి సభ్యురాలు విజయ జ్యోతి మాట్లాడుతూ నియోజకవర్గంలో అందరు నాయకులు కలసి పనిచేపేలా సమన్వయం చేయమంటే కలహాలు పెట్టి విడతీయాలని చూస్తున్నట్లు పరిస్థితి ఉందన్నారు. తమను దళితులమని చిన్నచూపు చూస్తే సహించేది లేదనన్నారు. మంత్రి ఆది అహంకారంతో మాట్లాడతున్నరని ఎద్దేవా చేశారు. నిజంగా కార్యకర్తలకు, నాయకులకు విజయమ్మ సమన్యాయం చేసి ఉంటే వారెందుకు తమ వద్దకు వస్తారని ప్రశ్నించారు. బద్వేలు టికెట్ నిర్ణయించేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, అధ్యక్షుడు కళా వెంకటరావులు...వారు ఎవరి పేరు నిర్ణయిస్తే వారి గెలుపు కోసం కృషి చేస్తామని, అధిష్టానం నిర్ణయం శిరోధార్యమన్నారు.
టికెట్ ఇచ్చేది...మీరు కాదు
అంతే తప్ప అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేది మంత్రి ఆదినారాయణరెడ్డి గానీ, విజయమ్మ కాన కాదన్నారు. తాము పార్టీ కోసం కలసి పనిచేయాలనుకున్నా ఆమె దూరం పెడుతోందని, పెత్తనం చేయాలని చూస్తోందని, ఆమె అడుగుజాడల్లో ఏ రకంగా నడవాలని ప్రశ్నించారు. మరో ముఖ్య విషయం అందరూ గమనించాలని బద్వేలు నియోజకవర్గంలో పోటీ చేసేది ఎస్సీ అభ్యర్థులే కానీ, ఇతరులు కాదన్నారు. తాము ఆస్తులు సంపాదించుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీలోకి రాలేదని, ప్రజాసేవ చేయాలనే ఉద్యోగానికి రాజీనామా చేసిమరీ వచ్చామన్నారు. 2014 ఎన్నికల్లో తాను ఎలా ఓటమి చెందిందీ అందరికీ తెలుసన్నారు. సీనియర్లను గౌరవిస్తాం... సలహాలు ఇవ్వండి, అంతేగానీ, కాలుకింద ఉండడంటే సహించేది లేదన్నారు.