సిఎం చంద్రబాబును పెళ్లికి ఆహ్వానించిన మంత్రి అఖిలప్రియ
అమరావతి:రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తన వివాహ వేడుకకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. సిఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్న భూమా అఖిల ప్రియ వివాహ ఆహ్వాన పత్రికను అందించి కుటుంబంతో సహా వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు.
మంత్రి అఖిల ప్రియ నిశ్చితార్థం ఇటీవలే మాజీ డిజిపి అల్లుడు భార్గవ్తో జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబును కలసి ఆహ్వాన పత్రికను అందించే సమయంలో మంత్రి అఖిల ప్రియ వెంట ఆమె వివాహం చేసుకోనున్న భార్గవ్,నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కూడా ఉన్నట్లు తెలిసింది. ఆగస్ట్ 29న తన వివాహం ఆళ్ళగడ్డలో జరగనుందని, ఆ వివాహానికి హాజరుకావాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు.
అయితే గోదావరి పడవ ప్రమాదం నేపధ్యంలో మంత్రి అఖిల ప్రియ ఎక్కడా కనిపించక పోవడం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా మంత్రి ఘటనా స్థలానికి వెళ్లలేదని, సహాయక చర్యలను ఏమాత్రం పర్యవేక్షించలేదని...అసలు మంత్రి అడ్రస్ ఎక్కడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అఖిల ప్రియ తన వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసేందుకు రావడంతో ఆ విమర్శలకు బ్రేక్ పడినట్లయింది.