పవన్ కల్యాణ్కు వారాహి అమ్మవారి శాపం వెంటాడుతుంది
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర.. మాటల యుద్ధానికి తెర తీసింది. ఆయన చేసే ఘాటు విమర్శలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే రేంజ్లో స్పందిస్తోన్నారు. కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ బహిరంగ సభల్లో చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో ఈ రెండు పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
కాకినాడ వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని నాని, ఏపీ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తిప్పికొట్టారు. తాజాగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బరిలోకి దిగారు. పవన్ కల్యాణ్పై ఘాటు విమర్శలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలన్నింటినీ అంశాలవారీగా తిప్పికొట్టారు.

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. పవన్ ఎప్పుడేం మాట్లాడతాడో ఎవరికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. ఒక్కరోజు, ఒక్కో సభలో ఒక్కో మాట మాట్లాడుతూ తనకు తానుగా గందరగోళంలో ఉంటోన్నాడని, రాజకీయాల పట్ల ఏ మాత్రం అవగాహన ఆయన లేదని విమర్శించారు. పార్టీ పెట్టి పదేళ్లవుతున్నా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపైనా స్పష్టత ఉండట్లేదని ఎద్దేవా చేశారు.
తనకు ప్రాణహాని ఉందంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అంబటి రాంబాబు అన్నారు. నిజంగా ప్రాణహాని ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. నోటికొచ్చిన విధంగా ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళం చేయాలని ప్రయత్నిస్తే ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
ప్రాణహాని ఉందంటూ పవన్ ఆరోపణలు చేయడం ఇది తొలిసారి కాదని, గతంలోనూ తనపై రెక్కీ చేశారని అన్నాడని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ని చంపడం వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించారు. ఈ నెల 23వ తేదీ తరువాత మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతాడని, అలా కాకుండా తాను ఏపీలోనే ఉంటానని, హైదరాబాద్కు వెళ్లకుండా ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు.
పవన్ కల్యాణ్ చెప్పు ఒకటీ బీజేపీ ఆఫీస్లో.. మరొకటి టీడీపీలో ఆఫీస్లో ఉందంటూ అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఆయనను ఓడించడానికి కుట్రలు చేయాల్సిన అవసరం ఉందా?, ఓడించడానికి 200 కోట్ల రూపాయలు అవసరమా? అని అన్నారు. సినిమా షూటింగ్స్ విరామ సమయంలో ఏపీకి వచ్చి రాజకీయాలు చేసి, మళ్లీ హైదరాబాద్కు వెళ్లిపోతాడని ధ్వజమెత్తారు.
2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో కౌరవ వధ జరిగిందని, సరిగ్గా 20 ఏళ్ల తరువాత 2024లో మళ్లీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో మరోసారి కౌరవ వధ జరగబోతుందని అంబటి పేర్కొన్నారు. వారాహి అంటే అమ్మవారు.. ఆ అమ్మవారిని వాహనంగా చేసుకున్న పవన్ కల్యాణ్ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడని, ఇక పవన్ కల్యాణ్ చేసే సినిమాలేవీ హిట్ కాబోవని, ఇది అమ్మవారి శాపమని చెప్పారు.












Click it and Unblock the Notifications