కేంద్రాన్ని కోరాం, ఒప్పుకొనే ప్రసక్తే లేదు - మంత్రి అంబటి..!!
కృష్ణా జిల్లాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని ఒప్పుకోమని స్పష్టం చేసారు. కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని కోరామని, ఈ మేరకు ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారన్నారు. కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారు.
ఏపీకి రావాల్సిన ప్రతి నీటిబొట్టును తీసుకుంటామని మంత్రి అంబటి వెల్లడించారు. అన్యాయంగా తీసుకెళ్తామంటే ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోమని చెప్పారు. తాజాగా వెలువడిన నిర్ణయం పైన సీఎం జగన్ వెంటనే ప్రధాని మోదీకి లేఖ రాసారు. అందులో అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్ఆర్డబ్ల్యూడీ-ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్) చట్టం-1956లో సెక్షన్-1 ప్రకారం కొనసాగుతున్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)-2కు మరిన్ని విధి విధానాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 1956 నాటి అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం (ISRWD)లోని సెక్షణ్ 4 ప్రకారం కృష్ణా జలవివాద ట్రిబ్యునల్ -1 (బచావత్, KWDT -1)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేసారు.

KWDT -I ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా 1976, మే 31న దీన్ని గెజిట్ చేసినట్లు వివరించారు. కృష్ణానదిలో 2130 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని KWDT -I ట్రైబ్యునల్ లెక్కకట్టిందని చెప్పారు. 75శాతం ప్రవాహాలు ఉంటాయన్న అంచనాతో ఈ లెక్క వేసిందన్నారు. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి KWDT-I 811 టీఎంసీల నీటిని కేటాయించిందని వివరించారు. 2130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న నీటిని, మిగులు ప్రవాహాలను ఉపయోగించుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వేఛ్చను ఇచ్చిందన్నారు. ISRWD చట్టం, 1956లోని సెక్షన్ 6(1) ప్రకారం, KWDT-I చేసిన అవార్డును సుప్రీం కోర్ట్ డిక్రీ ద్వారా అమల్లోకి వచ్చిందిని చెప్పారు.
KWDT-II యొక్క నిర్ణయాన్ని సవాల్చేస్తూ సుప్రీంకోర్టులో 5 SLPలను కృష్ణానదీజలాలపై ఆధారపడ్డ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దాఖలు చేశాయని గుర్తు చేసారు. సెక్షన్ 5(2) ప్రకారం KWDT-II నివేదికను పక్కన పెట్టాలంటూ పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టును అభ్యర్థించిందని చెప్పారు. సుప్రీం కోర్ట్ తన ఉత్తర్వుల ద్వారా 16.09.2011న KWDT-IIపై స్టే ఇచ్చిందని వివరించారు. అన్ని SLPలు సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేస్తూ..వాస్తవాలను పరిగణలోకి తీసుకుని, ఇందులో ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదేశించాలని ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ కోరారు.












Click it and Unblock the Notifications