ఏపీలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలకనిర్ణయం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన మంత్రులు వారి వారి శాఖలలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ కూడా రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి కసరత్తు మొదలుపెట్టారు . ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో రెవెన్యూ శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆదేశించారు.
రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి
నేడు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పలు ప్రాధాన్యతా అంశాల అమలుతీరును సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి జననం నుండి మరణం వరకూ పలు రకాల సేవలు అందజేయడంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఎంతో ఓర్పు, నేర్పుతో ప్రజలకు సేవచేయాలన్నారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్
రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్సు సెల్ ను కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా రెవిన్యూ శాఖలోని మంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు, సలహాలు అందజేయాలని ఆయన కోరారు. రెవెన్యూ ఉద్యోగుల పని విధానంతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని రెవిన్యూ ఉద్యోగులు అంతా గుర్తించాలన్నారు.
రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోండి
రెవెన్యూ అంశాలకు సంబందించి ప్రజలు ఎక్కువగా సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. అసలు ఎటు వంటి అంశాలు, సందర్బాల్లో ప్రజలు సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందనే విషయాన్ని రెవిన్యూ అధికారులు ముందుగానే గుర్తించి, వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అమలు చేయబడుచున్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం, రీసర్వే, రీసర్వే గ్రామాల్లోని ఫైనల్ రికార్డుల స్థితిగతులు ఆయన సమీక్షలో తెలుసుకున్నారు.
అన్ని రెవెన్యూ అంశాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన అధికారులు
న్యూ సిటిజన్ సర్వీసెస్ అమలు, రెవిన్యూ అధికారులకు అందజేసే సర్వే శిక్షణ, కుల దృవీకరణ పత్రాల సత్వర జారీకై అనుసరిస్తున్న విధి విధానాలతో పాటు, ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పలు ముఖ్యమైన ఫైల్స్ స్థితి గతులు తదితర అంశాలపై సీసీఎల్ఏ జి సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.












Click it and Unblock the Notifications