పోలవరం పవర్ ప్రాజెక్ట్ విషయంలోనే హై కోర్టు తీర్పు .. నిర్మాణ పనుల్లో కాదన్న మంత్రి అనిల్
ఏపీ సీఎంవైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ హైకోర్టు పోలవరం ప్రాజెక్టు విషయంలో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి హైడల్ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ నిలుపుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది .టెండరింగ్ ప్రక్రియపై ముందుకు వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది హైకోర్ట్. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానాలు తప్పని హైకోర్టు ఎక్కడ చెప్పలేదన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్
ఇక పోలవరం ప్రాజెక్టు వల్ల రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడుతూ ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతి, దోపిడీని అరికట్టేందుకే సీఎం రివర్స్ టెండరింగ్కి వెళ్లినట్టు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వ విధానాలు తప్పని హైకోర్టు ఎక్కడ చెప్పలేదని మంత్రి వివరణ ఇచ్చారు. ఒకపక్క మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టు తీర్పు విషయంలో పోలవరం ప్రాజెక్టుపై ప్రయోగం చెయ్యొద్దని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను అని ఇప్పుడు హైకోర్టు తీర్పు విషయంలో జగన్ ఏం సమాధానం చెబుతారు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి పిచ్చి పట్టింది అనుకోవాలా, రాష్ట్రానికి శని పట్టింది అనుకోవాలా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళితే చంద్రబాబుకు భయమెందుకు అన్న మంత్రి అనిల్
ఇక ఈ నేపథ్యంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళితే టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోతున్నాయి అంటూ అటు చంద్రబాబు, టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టు పనుల్లో ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్కు వెళ్ళినట్టు వివరించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కోర్టు తీర్పు నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపై అడ్వకేట్ జనరల్తో చర్చిస్తున్నామని మంత్రి అనిల్ పేర్కొన్నారు.

పోలవరం నిర్మాణ పనులు ఆగిపోయాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్న మంత్రి అనిల్
ప్రస్తుతం పోలవరం పై జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తమని మంత్రి కొట్టిపారేశారు. పోలవరంపై మొదటినుంచి తమ విధానం ఒకటేనని, అవినీతిని వెలికితీసి , ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడటమే నని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. హైకోర్టు రివర్స్ ఎండింగ్ ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వం చేస్తున్నదే సరైనదని అయినప్పటికీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఇక ఈ వ్యాఖ్యలతో రివర్స్ టెండరింగ్ విషయంలో వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే ఆలోచనలో లేదని స్పష్టంగా అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications