తిరుమలలో మంత్రి అప్పలరాజు - కొత్త వివాదం..!!
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలొ మంత్రి అప్పలరాజు తీరు వివాదానికి కారణమైంది. మంత్రి అప్పలరాజు శ్రీవారి దర్శనం కోసం భారీగా తన అనుచరులతో కలిసి తిరుమల చేరుకున్నారు. ఆ సమయంతో దాదాపుగా 140 మంది అనుచరులకు ప్రోటోకాల్ దర్శనం కల్పించాలంటూ అధికారులపైన ఒత్తిడి తెచ్చారు. తొలుత సాధ్యపడదని చెప్పిన టీటీడీ అధికారులు ఆ తరువాత ఆయన ఒత్తిడి తలొగ్గారు. నింధనలకు పక్కన పెట్టి మంత్రి అనుచరులు 20 మందికి ప్రోటోకాల్ దర్శనం కల్పించారు. మిగిలిన వారికి బ్రేక్ దర్శనం కల్పించారు. దీంతో..సామాన్య భక్తులకు అసౌకర్యం ఏర్పడింది.
దీని పైన దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి దర్శనం కోసం టీటీడీ అధికారుల పైన తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి హోదాలో ఉంటూ..ఒకేసారి ఇంత మందికి ప్రోటోకాల్.. బ్రేక్ దర్శనం కావాలని కోరటం..ఒత్తిడి చేయటం ద్వారా సామాన్య భక్తలకు ఇబ్బందులు కలిగిస్తారా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే, ఈ వివాదం పైన మంత్రి అప్పలరాజు స్పందించారు. విమర్శలు వస్తున్నట్లుగా తాను ఎక్కడా అధికార హోదా ప్రదర్శించలేదన్నారు. తన నియోజకవర్గ ప్రజలతో శ్రీవారి దర్శనానికి వచ్చానని చెప్పారు. తాను సామాన్య భక్తుడి మాదిరిగానే క్యూ లైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నానని వివరించారు.
శ్రీవారిని దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అయితే, టీటీడీ కొంత కాలంగా వారాంతంలో మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. సామాన్యులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. కరోనా తరువాత తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో..దర్శనం అంశంలో సామన్యులను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నామని టీటీడీ చెబుతోంది. కానీ, మంత్రులే తమ అనుచరులతో కలిసి బ్రేక్ - ప్రోటోకాల్ దర్శనాల కోసం ఒత్తిడి చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.