అక్కడ మంత్రిని అరెస్ట్ చేశారు.. ఇక్కడ ఎమ్మెల్సీని కాపాడుతున్నారు.. అదీ తేడా??
ఒక శాసనమండలి సభ్యుడు తన కారు మాజీ డ్రైవర్ను హత్యచేసి నిరభ్యంతరంగా బయటే నాలుగు రోజులు తిరిగారు. ఆ నాలుగురోజులు పోలీసులకు సదరు ఎమ్మెల్సీ కనపడలేదు. ఎస్పీ స్థాయి వ్యక్తులే ఎమ్మెల్సీ గారూ.. అంటూ గౌరవిస్తున్నారు. వ్యవస్థను అపహాస్యం పాల్జేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి అరెస్ట్ చేయక తప్పలేదు. ఇదీ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం.. అమలవుతున్న రాజ్యాంగం.
మంత్రి పదవి నుంచి పీకేసి వెంటనే అరెస్ట్
పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఉన్నారు. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాను మంత్రి పదవి నుంచి పీకేసి అరెస్ట్ చేయించారు. ఆయనపై ఏసీబీ కేసులు నమోదు చేయించారు. దీనికి కారణం.. ఆరోగ్యశాఖకు సంబంధించిన ప్రతి కాంట్రాక్టులోను తనకు ఒకశాతం కమీషన్గా ఇవ్వాలని డిమాండ్ చేయడమే. స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఆయనపై కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించారు. ఆయన ఒక్క శాతం కమీషన్ అడగడం కాదని, రాష్ట్రంలో ఒక్క శాతం అవినీతి జరిగినా సహించేది లేదని ఇతర మంత్రులను హెచ్చరించారు. ఇదీ పంజాబ్లో ప్రజాస్వామ్యం.. అమలవుతున్న రాజ్యాంగం.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆప్ పరిపాలన
ప్రజలు ఎన్నో అంచనాలు, ఆశల మధ్య పంజాబ్లో ఆప్ ప్రభుత్వానికి భారీ మెజారిటీ కట్టబెట్టి అధికారాన్ని అప్పగించారు. వారి ఆశలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ లక్ష్యమని ఆప్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం రోజే ప్రకటించింది. అందుకనుగుణంగా పరిపాలన కొనసాగిస్తోంది. అప్పటికప్పుడు మంత్రిని పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయించడం దేశంలో ఇంతవరకు జరగలేదు. కానీ ఇప్పుడు పంజాబ్లో జరిగింది. గతంలో తెలంగాణాలో కూడా మంత్రి రాజయ్యను తొలగించారుకానీ కేసుల్లాంటివేవీ నమోదు ఏయలేదు.
నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా!
ఏపీకి, పంజాబ్కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించకుండా టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తూ, వారి ఆర్థిక మూలాలను ధ్వంసం చేస్తూ, అప్పులు చేసి ఆ డబ్బులను ప్రజల ఖాతాల్లోకి వేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న వైసీపీ ప్రభుత్వం పంజాబ్ ను చూసి నేర్చుకోవాల్సింది చాలావుందని సూచిస్తున్నారు.