మాకూ టైమొస్తుంది: రోజా సస్పెన్షన్పై జగన్ నిరసన, అచ్చెన్నాయుడు వార్నింగ్
హైదరాబాద్: సభ నుంచి ఏడాది పాటు సస్సెన్షన్కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజాను గేటు వద్ద ఆపడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై పునరాలోచించుకోవాలని స్పీకర్ను కోరారు. లేదంటే సభ జరగనివ్వమన్నారు. అయితే ఇందుకు స్పీకర్ నిరాకరించారు.
సభను జరగనివ్వమనే అధికారం ప్రతిపక్షానికి లేదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శాసనసభ అనేది ఏ ఒక్కరి ఆస్తి కాదన్నారు. రెండు రోజులు నుంచి జీరో అవర్ను ఉపయోగించుకోవడం లేదని, కనీసం ఈరోజైన క్వశ్చన్ అవర్ను ఉపయోగించుకోవాలని వైసీపీ సభ్యులకు ఆయన సూచించారు.

ఈరోజు సభలో మీరు అధికార పక్షంలో ఉన్నారని, రేపు మేముంటామని జగన్ అన్నారు. ఇలా సభ్యులను సస్పెన్షన్ చేసుకుంటూ పోతే భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. సభలో తమకు అన్యాయం జరుగుతుందన్నారు. అధికార పక్షం సభను వాళ్లకు కావల్సిన విధంగా జరుపుతోందన్నారు.
ప్రజల వాయిస్ను వినేందుకు అధికార పార్టీ సభ్యులు సిద్దంగా లేరన్నారు. బెజవాడలో వెలుగు చూసి, రాష్ట్రవ్యాప్తంగా వేళ్లూనుకున్న కాల్ మనీ దందాపై బీజేపీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు విపక్షాల్లాగా తాము అనవసర రాద్ధాంతం చేయడానికి రాలేదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన కాల్ మనీపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సబా నాయకుడు, సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రత్యేకించి చర్చకు అనుమతించలేమని స్పీకర్ తేల్చిచెప్పారు. అనంతరం విష్ణుకుమార్ రాజు రోజా సస్పెన్షన్పై మాట్లాడారు.
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు. సభ్యురాలని ఈ సమావేశాల వరకు అయితే సస్సెన్షన్ చేస్తే బాగుటుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేపై ఏడాది పాటు సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమని జగన్ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సమయంలో కలుగజేసుకున్న టీడీపీ సీనియర్ నేత, కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో సీనియర్లు, జూనియర్లు ఉండరని చెప్పిన ఓ సభ్యుడు ‘బుల్లెట్ దిగిందా? లేదా? అన్నదే ముఖ్యం' అని వ్యాఖ్యానించారన్నారు. మీరు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే రోజాకు పట్టిన గతే మీకు పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.
సభా నియమాలు తెలుసుకోవాలన్న సూచన చేస్తేనే అంతెత్తున ఎగిరిపడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. సభాపతిపై కూడా రోజా అనుచితి వ్యాఖ్యలు చేశారన్నారు. గతంలో దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఓ మారుమాలు గ్రామంలో తమ పార్టీ సభ్యుడు కరణం బలరాంను స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆర్నెల్ల పాటు సస్పెండ్ చేసిన విషయాన్ని మరిచిపోయారా? అని ఆయన ప్రశ్నించారు.
సభా నియమాలను గౌరవించకుంటే రోజాకు పట్టిన గతే మిగిలిన విపక్ష సభ్యులకు తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నమ్మి మునిగి పోయానని సభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజా బాధపడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
రోజాను సస్పెండ్ను చేసినప్పుడు జగన్ కనీసం నిరసన కూడా తెలియజేయలేదన్నారు. ప్రతిపక్ష నేత జగన్ మాటలు విని వైసీపీ సభ్యులు దురుసుగా ప్రవర్తించొద్దని సూచించారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.












Click it and Unblock the Notifications