బెదిరిన ఎడ్లు, బండి మీద నుంచి కిందపడ్డ అచ్చెన్న, కదిరి ఎమ్మెల్యేకు సొంత పార్టీలో షాక్
విశాఖపట్నంలోని అనకాపల్లి మండలం తుంపాల గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు ఎడ్ల బండి పై నుంచి కిందపడ్డారు.
విశాఖ: విశాఖపట్నంలోని అనకాపల్లి మండలం తుంపాల గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు ఎడ్ల బండి పై నుంచి కిందపడ్డారు. పెద్ద ఎత్తున వచ్చిన జనాలను చూసి, ఎడ్లు బెదరడంతో బండి పైన ఉన్న వారు కిందపడ్డారు.
మంత్రి, ఎమ్మెల్యే తుంపాల గ్రామంలో జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఈ అపశృతి చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కార్యకర్తలు మంత్రి అచ్చెన్నను, ఎమ్మెల్యే పీలాను లేపారు. వారికి చిన్న గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.
కదిరి టీడీపీ ఎమ్మెల్యేకు నిరసనల సెగ
అనంతపురం జిల్లా కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చాంద్ బాషాకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తగిలింది. జనచైతన్య యాత్రలో భాగంగా చాంద్ బాషా నల్లచెరువు మండలం గోరంట్లవారిపల్లెకు వెళ్లారు.
ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ను పార్టీకి దూరం చేస్తున్నారంటూ స్థానిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలుగా టిడిపి కార్యకర్తలు విడిపోయి వాగ్వాదానికి దిగారు. ఇది చిలికిచిలికి గాలివానగా మారడంతో బాహాబాహీకి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరువర్గాలకు సర్దిచెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.