ఏపీలో రాజకీయ బురద..!! కృత్రిమ వరదను విశాఖ , విజయనగరానికి పంపిండి బాబుకు అవంతి కౌంటర్
ఏపీలో వైసీపీ పాలనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హుందాగా వ్యవహరించాల్సినది పోయి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. వరదల విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు ఇల్లు ముంచడం, ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ క్రియేట్ చేయడం తప్ప ప్రభుత్వానికి వేరే పనేమీ లేదా? అన్న అవంతి శ్రీనివాస్
ఏపీలో వచ్చిన వరదలు సహజంగా సంభవించినవి కావని, కృత్రిమ వరదలను వైసీపీ ప్రభుత్వం సృష్టించిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు ఇంటిని ముంచటం కోసం వరదలు సృష్టించారని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. చంద్రబాబు గారూ కొత్త పదం కనిపెట్టారు అన్న అవంతి శ్రీనివాస్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ అంట. అలాంటివి ఏవన్నా ఉంటే, విశాఖపట్టణం, విజయనగరానికి పంపించాలని ఆయన పేర్కొన్నారు. వర్షాలు లేక చస్తున్నాం. చంద్రబాబునాయుడి ఇల్లు ముంచడం, ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ క్రియేట్ చేయడం తప్ప ప్రభుత్వానికి వేరే పనేమీ లేదా? అని మంత్రి అవంతి ధ్వజమెత్తారు.
చంద్రబాబు ప్రతిదాన్నీ రాజకీయం చేయాలన్న ఆలోచన తగ్గించుకోండని సలహా ఇచ్చిన అవంతి
అర్ధంలేని విమర్శలు మాని ముందు చంద్రబాబు టీడీపీలో ఉన్న వైఫల్యాలను సరిచేసుకోండి అంటూ హితవు పలికారు. రెండోది, వయసు, అనుభవం రీత్యా మీరు హుందాగా వ్యవహరించండి అంటూ సూచించారు అవంతి శ్రీనివాస్ . నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి అంటూ చంద్రబాబుకు సలహా ఇచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఇక చంద్రబాబు ప్రతిదాన్నీ రాజకీయం చేయాలన్న ఆలోచన తగ్గించుకోండి అంటూ చురకలు వేశారు అవంతి శ్రీనివాస్.
ఇక అంతే కాదు ఏపీ రాజధాని తరలింపు అంశంపైన కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్ .
సుజనా ఇంతకీ నువ్వు ఏ పార్టీ అంటూ సుజనా చౌదరిపై ఫైర్ అయిన అవంతి శ్రీనివాస్ బిజెపి ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంతకీ సుజనా.. మీరు ఏ పార్టీ అంటూ ప్రశ్నించారు. మీరు టిడిపి వైపు మాట్లాడుతున్నారా లేక బిజెపి పక్షాన మాట్లాడుతున్నారా అంటూ వ్యాఖ్యానించిన అవంతి శ్రీనివాస్ రాజధాని మార్చితే విప్లవం వస్తుందని సుజనా వ్యాఖ్యలను ఉద్దేశించి రాష్ట్రానికి రావాల్సిన వరద సహాయం అందకపోతే నిజంగానే విప్లవం వస్తుందని, బిజెపి పై తిరుగుబాటు ప్రారంభం అవుతుందని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు. అంతేకాదు టిడిపి నుండి వైసీపీలోకి జంప్ చేయడానికి 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని జగన్ లాక్ తెరిస్తే ఆ పది మంది వైసీపీ లోకి వచ్చి పడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు అవంతి శ్రీనివాస్. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతిని బయటకు తీస్తాము అంటూ హెచ్చరించారు. విశాఖలో ఐదేళ్లలో జరిగిన భూ కబ్జాలకు కారకులైన వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శకమైన పాలన అందించటానికి నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.