చంద్రబాబును విమర్శించే అర్హత చిరుకు లేదు: అయ్యన్న, చివరి రోజు వీఐపీల పుష్కర స్నానం
రాజమండ్రి: సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి లేదని ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. పార్టీని నడపలేక కాంగ్రెస్లో విలీనం చేసిన చిరంజీవికి చంద్రాబబును విమర్శించే అర్హత లేదని అయ్యన్నపాత్రుడు అన్నారు.
ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయాలనుకోవడం సరికాదని సూచించారు. శనివారం కైకలూరులో పుష్కర యాత్రికులకు మంత్రి ఆహారపొట్లాలను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చివరి రోజు ప్రముఖుల పుణ్యస్నానం
గోదావరి మహా పుష్కరాల చివరిరోజు రాజమండ్రిలోని పుష్కర ఘాట్లలో పులువురు ప్రముఖులు పుణ్యస్నానం చేశారు. వీఐపీ ఘాట్లో ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, డాలర్ శేషాద్రి సహా పలువురు ప్రముఖులు పుణ్యస్నానమాచరించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం సిద్ధాంతం కేదార్ఘాట్లో శనివారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పుణ్యస్నానం ఆచరించారు. ఎమ్మెల్యేతో పాటు 500 మంది కార్యకర్తలు ర్యాలీగా వచ్చి పుష్కరస్నానాలు చేశారు. ఇక కొవ్వూరులోని గోష్పాదక్షేత్రంలో ఏపీ డీజీపీ జేవీ రాముడు పుష్కర స్నానం చేశారు. సతీసమేతంగా వచ్చిన డీజీపీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.