కాంగ్రెస్, జగన్ వల్లే రాష్ట్ర విభజన: అయ్యన్న, మంత్రి అచ్చెన్నాయుడు, శివాజీ మధ్య వాగ్వాదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు జగన్, కాంగ్రెస్సే కారణమని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని అడ్డుకోవడానికే వైయస్ జగన్ ఈ నెల 29న బంద్కు పిలుపునిచ్చారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటే జగన్ తన బంద్ను ఉపసంహరించుకోవాలన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శివాజీ మధ్య వాగ్వాదం
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌస్ శ్యామ సుందర్ శివాజీ మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మిల్లర్లకు ధాన్యం చెల్లింపుల విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు మౌనం వహించారని ఎమ్మెల్యే శివాజీ ఆరోపించారు.
అయితే దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు తప్పు చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. ధాన్యం చెల్లింపుల విషయంలో శివాజీ అవహగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
సీఎం క్యాంపు కార్యాలయానికి రూ.95లక్షలు మంజూరు
విజయవాడలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రూ.95.28 లక్షలు మంజూరు చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి. ప్రసాదరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ భవనానికి మరమ్మతులు చేయడం, ఆధునికరించడానికి రూ.63.58 లక్షలు, యాక్సెస్ కంట్రోల్ ఉపకరణాలు ఏర్పాటుకు రూ.31.7 లక్షలు మంజూరు చేశారు. వీటికి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నిఘా విభాగం అదనపు డీజీని హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.