సీపీఎస్ రద్దు కోసం టీచర్లు ఉద్యమించిన వేళ..మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు: వాటీజ్ దిస్
విజయవాడ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రోడ్డెక్కింది. తన ఆందోళనను మరింత ఉధృతం చేసింది. ఛలో సీఎంఓ ఆందోళనకు పిలుపునిచ్చింది. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలయిన తరువాత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీపీఎస్ను రద్దు చేయట్లేదంటూ మండిపడుతోంది. ఛలో సీఎంఓ ఆందోళనలో పాల్గొనడానికి వస్తోన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, యూటీఎఫ్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తోన్నారు.
విస్తృత తనిఖీలు..
పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. విజయవాడలోని యూటీఎఫ్ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న తాడేపల్లిలో వందలాది మందిలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయవాడకు వచ్చే అన్ని రహదారుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ మార్గంలో వచ్చే వాహనాలను జల్లెడపడుతున్నారు. ఇబ్రహీంపట్నం, హనుమాన్ జంక్షన్, కంకిపాడు, తాడేపల్లి, మంగళగిరి రహదారుల వద్ద బ్యారికేడ్లను అమర్చారు.
పాత ఫించన్ విధానం కోసం..
ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లించారు. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై ముందు జాగ్రత్తగా ఫెన్సింగ్ను అమర్చారు. దీనితోపాటు వచ్చేనెల 20వ తేదీ వరకూ ఉపాధ్యాయుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఇదివరకే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సీపీఎస్ స్థానంలో పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలనేది యూటీఎఫ్ ప్రధాన డిమాండ్.
కమిటీతో కాలయాపన..
దీనికోసం తాము చేస్తోన్న విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమించాల్సి వచ్చిందనేది యూటీఎఫ్ నేతల వాదన. సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడాన్ని యూటీఎఫ్ తప్పుపడుతోంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందంటూ ఆరోపణలు చేస్తోంది. సీపీఎస్ రద్దు వ్యవహారంపై చర్చలు జరుపుతామని, దీనికోసం తేదీలను కూడా ఖరారు చేసిన తరువాత కూడా ప్రభుత్వం వెనకడుగు వేస్తోందంటూ విమర్శలు చేస్తోన్నారు యూటీఎఫ్ నాయకులు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు..
ఈ పరిణామాల మధ్య విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీ సీపీఎస్ రద్దు అంశాన్ని పరిశీలిస్తోందని, దీనిపై త్వరలోనే సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందని అన్నారు. మంత్రుల కమిటీ దీనిపై అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఉపాధ్యాయులు ఛలో సీఎంఓ ఆందోళనను చేపట్టడం సరి కాదని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగొంచొద్దని విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో జరగరానిది జరిగితే ఎవరు బాధత్య వహిస్తారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడం కరెక్టేనా?
ఆందోళనను అడ్డుకునే విషయంలో ప్రభుత్వం విఫలమైందని, శాంతిభద్రతలను కాపాడలేకపోయిందని మళ్లీ వారే అంటారని చెప్పారు. ఇదివరకు విజయవాడలో ఆందోళన చేపట్టారని, దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి ఇంటినే ముట్టడిస్తామనడంలో అర్థం లేదని అన్నారు. ప్రజలు గానీ, మీడియా గానీ దీన్ని సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సమర్థనీయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది పాజిటివ్ ప్రభుత్వమని, మానవతా దృక్పథంతో అన్ని నిర్ణయాలను తీసుకుంటామని చెప్పారు.
రాద్ధాంతం ఎందుకు?
సీపీఎస్పై కమిటీ వేశామని, ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తుందని, దీనిపై త్వరలోనే సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. యూటీఎఫ్ సభ్యులు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. ఉపాధ్యాయుల సెలవుపై తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని పాజిటివ్గా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.