రోడ్డుమీదే గంటన్నర ఉన్నాను!!
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. అయితే, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మాత్రం సరికాదని వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మంత్రులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవద్దా? తీసుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో పవన్ సభ రద్దు చేసుకుంటే మా తప్పవుతుందా? అన్నారు. ఊరేగింపు వద్దు.. సభ నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పారు.. ర్యాలీకి ముందుగా అనుమతి తీసుకుంటే పోలీసులే వేరే రూట్మ్యాప్ ఇచ్చేవారన్నారు. పవన్ వచ్చినరోజు ట్రాఫిక్లో గంటన్నరసేపు రోడ్డుపై ఉండిపోయానన్నారు.
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధికార వైసీపీ నేతలపై, మంత్రులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు నోటీసులివ్వడంతో మూడురోజుల విశాఖ పర్యటనను అర్థంతరంగా రద్దుచేసుకొని మంగళగిరిలోని కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ చెప్పు చూపిస్తూ మాట్లాడారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రులు గుడివాడ అమర్ నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి పేర్ని నాని, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు.
విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రం సరికాదన్నారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులకు కారణమయ్యాయి. రోడ్ మ్యాప్ అడిగినప్పటికీ బీజేపీ ఇవ్వలేదని, స్థానికంగా ఉండే పరిస్థితులకు అనుగుణంగా తాను వ్యూహం మార్చుకుంటానని, దానికే మోడీపై వ్యతిరేకత కానీ, బీజేపీకి దూరంకానీ జరిగినట్లు కాదని పవన్ స్పష్టం చేశారు. చంద్రబాబు స్వయంగా వచ్చి మాట్లాడటంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి.